ముఖ్యమంత్రి చంద్రబాబుపై ప్రధాని మోడికీ ముద్రగడ ఫిర్యాదు:దర్యాప్తు జరపండి
తూర్పు గోదావరి:ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్టంలో అంతులేని అవినీతికి పాల్పడుతున్నారని, ఆయన అక్రమాలపై విచారణ జరిపించాలని కోరుతూ కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు.
ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికి పోయిన ఈ ముఖ్యమంత్రిని ఆ రోజే జైలుకి పంపి ఉంటే ఈ రోజు రాష్ట్రానికి ఇంత అన్యాయం జరిగి ఉండేది కాదని ముద్రగడ తన లేఖలో పేర్కొన్నారు. 2014 నుంచి ముఖ్యమంత్రి చేస్తున్న దోపిడీ వివరించాలంటే మహాభారత గ్రంధాన్ని మించి ఉంటుందని వ్యాఖ్యానించారు. రైతుల భూములు అమరావతి పేరు మీద తీసుకొని వాటితో వారి సామాజిక వర్గంలోని కొందరితో వ్యాపారం చేయిస్తున్నారంటూ ముద్రగడ తన లేఖలో తీవ్ర ఆరోపణలు చేశారు.
ప్రకృతి ప్రసాదించిన ఇసుకను ఉచితం పేరుతో కోట్లాది రూపాయలు దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. లేట్రేట్ గనులు, వ్యాపారాలకు రోడ్లు వేయడానికి శాంక్షన్లు ఇస్తున్నారని, ప్రజలకు అవసరమైన రోడ్లను వేయడానికి నిధులు లేవంటున్నారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు 2014 నుంచి విరామం లేకుండా ప్రజాధనాన్ని దోచుకుంటున్నాడని, ఇంతటి దోపిడీ ఘనుడు ప్రపంచంలోనే ఉండడని ముద్రగడ రాశారు.
2014 లో ఎన్నో కులాల వారికి వరాలు హామీగా ఇచ్చాడని, ఇప్పుడు ఆ హామీలు 98 శాతం అమలు చేసేశానని తిరిగి నాకే ఓటు వేయండని ప్రచారం మొదలు పెట్టాడని పేర్కొన్నారు. అయితే ఆ 98 శాతం కుటుంబ అభివృద్దికే నని, ప్రజల అభివృద్దికి చేసింది 2 శాతమేనన్నారు.
మోసం,దగా, అబద్దాలే రాజకీయ జీవితం అయిన ఈ అవినీతి సామ్రాట్ పై సిబిఐ, ఇన్ కమ్ ట్యాక్స్, ఈడీ వగైరా శాఖల ద్వారా దర్యాప్తు చేయించి రాష్ట్రాన్ని,ప్రజలను కాపాడాలన్నారు. అయితే దర్యాప్తు సందర్భంలో ఆయన పదవిలో ఉంటే దర్యాప్తుకి ఆటంకం కలుగుతుందని ముద్రగడ పేర్కొన్నారు. చంద్రబాబుపై ఎంక్వైరీ వేసిన తక్షణమే ఆంధ్ర ప్రదేశ్ కి ప్రత్యేక హోదాని, రైల్వే జోన్ ని, కడప స్టీల్ ప్లాంట్,విభజన హామీల అమలుకు ఆదేశాలు ఇవ్వవలసిందిగా మోడీని తన లేఖలో ముద్రగడ పద్మనాభం కోరారు.