ఎన్టీఆర్ను చెప్పులతో కొట్టించిన చరిత్ర నీది!:బాబుకు ముద్రగడ ఘాటు లేఖ..
ఎన్టీఆర్ పార్టీ పెట్టిన తర్వాత చంద్రబాబు టీడీపీలోకి వెళ్లడం, ఆపై వెన్నుపోటు పొడవడం, చెప్పులతో కూడా దాడి చేయించడం వంటి అంశాలను ముద్రగడ లేఖలో పేర్కొన్నారట.
విజయవాడ: నిన్న మొన్నటిదాకా కాస్త మెతగ్గానే కనిపించిన ముద్రగడ.. ఇకనుంచి బుజ్జగించినట్లుగా కాకుండా.. తాడో పేడో తేల్చుకోవాలనే రీతిలో వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇదే క్రమంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ను సైతం ముద్రగడ ఏకిపారేసిన సంగతి తెలిసిందే. పవన్కు బొట్టు పిలవాలా?, ఆయన ఏ రోజు కాపులకు సహకరించింది లేదంటూ తీవ్ర విమర్శలు చేశారు.
తాజాగా అంతే ఘాటుగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడకు ముద్రగడ లేఖ రాశారు. కాపుల రిజర్వేషన్ అంశాన్ని తేల్చుకునేందుకు చంద్రబాబుకు కాస్త గట్టిగానే ఈ లేఖ రాశారట. అంతేకాదు, గతంలో చంద్రబాబు వైఖరిని, ఆయన వెన్నుపోటు ఉదంతాలను కూడా ముద్రగడ లేఖలో పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది.
ఎన్టీఆర్ పార్టీ పెట్టిన తర్వాత చంద్రబాబు టీడీపీలోకి వెళ్లడం, ఆపై వెన్నుపోటు పొడవడం, చెప్పులతో కూడా దాడి చేయించడం వంటి అంశాలను ముద్రగడ లేఖలో పేర్కొన్నారట. కాపు రిజర్వేషన్ల విషయంలో చంద్రబాబు చిత్తశుద్దిని ఎండగడుతూ మొత్తం మూడు పేజీల లేఖను ముద్రగడ రాసినట్లుగా తెలుస్తోంది. ఎన్నికల హామిలు, కోట్ల రూపాయల అక్రమార్జనపై ముద్రగడ ఘాటుగానే స్పందించారు.
అయితే లేఖలో చంద్రబాబు గతాన్ని, వెన్నుపోటు అంశాన్ని ప్రస్తావించడం పట్ల పలువురు కాపు నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అసలు విషయం గురించి మాట్లాడకుండా చంద్రబాబు రాజకీయాల గురించి విమర్శించడాన్ని వారు తప్పుపడుతున్నారట.
సమస్యను సానుకూలంగా పరిష్కరించుకోవాలి గానీ వ్యక్తిగత విమర్శలకు తావు ఇవ్వవద్దని అభిప్రాయపడుతున్నారట. మొత్తంగా చంద్రబాబుకు లేఖ విషయంలో కాపుల నుంచే ముద్రగడ విమర్శలు ఎదుర్కొంటున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.