తుని ఘటనపై ట్విస్ట్ : ప్రభుత్వం దొగొచ్చినా.. ముద్రగడ 'నో'
రాజమండ్రి : ఆసుపత్రిలోను దీక్షను కొనసాగిస్తున్న కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం డిమాండ్ల విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గట్లేదు. అయితే తుని ఘటనకు సంబంధించి సీబీఐ విచారణకు సుముఖత వ్యక్తం చేయని ముద్రగడ, అరెస్టు చేసినవారిని విడుదల చేసేదాక తన దీక్ష విరమించేది లేదని తేల్చి చెబుతున్నట్టుగా సమాచారం.
ఇదే నేపథ్యంలో.. ప్రతిపక్షాల నుంచి వస్తున్న డిమాండ్ మేరకు సీబీఐ విచారణకు ఓకె చెప్పిన ప్రభుత్వం ఇదే విషయాన్ని ముద్రగడకు వివరించి దీక్ష విరమింపజేయాల్సిందిగా తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ రవిప్రకాష్ తో సందేశం పంపించింది. అయితే సీబీఐ విచారణ గురించి ఎస్పీ రవిప్రకాష్ ముద్రగడతో ప్రస్తావించగా, ముద్రగడ మాత్రం ప్రభుత్వ ప్రతిపాదనను తిరస్కరించినట్టుగా సమాచారం.
కాగా, సీబీఐ విచారణను తిరస్కరిస్తున్న ముద్రగడ పద్మనాభం అరెస్టు చేసినవారిని మాత్రం వెంటనే విడుదల చేయాలని ఎస్పీ రవిప్రకాష్ తో చెప్పినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఎస్పీ రవిప్రకాష్ మీడియా సమావేశం ద్వారా మరిన్ని వివరాలను తెలియజేసే అవకాశం ఉంది.
ఇదిలా ఉంటే, ముద్రగడ దీక్ష నేపథ్యంలో నిన్న సమావేశమైన ఏపీ కేబినెట్, ప్రతిపక్షాల నుంచి వస్తున్న డిమాండ్ మేరకు తుని ఘటనపై సీబీఐ విచారణకు సంసిద్దత వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
నిందితులను విడిచిపెట్టమనడం ఏంతవరకు సమంజసం..? : గంటా
విశాఖపట్నం : తుని ఘటన అరెస్టులను వ్యతిరేకిస్తూ, అరెస్టయిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్న ముద్రగడ పద్మనాభం వ్యవహార శైలిని తప్పుబట్టారు ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు. విధ్వంసానికి కారణమైన వారిని విడిచిపెట్టమనడం సమంజసం కాదన్న ఆయన, అరెస్టులన్ని పూర్తి ఆధారాలతో జరిగినవేనన్నారు.
నాలుగు నెలల పాటు కష్టపడి దర్యాప్తు చేసి నిందితులను పట్టుకుంటే, ఇప్పుడు వాళ్లను విడిచి పెట్టాలని కోరడం ఎంతవరకు సమర్థనీయం అంటూ ప్రశ్నించారు గంటా.