కాపు ఉద్యమంలోకి మళ్లీ రాలేనన్న ముద్రగడ- ఇబ్బంది పెట్టొద్దని నేతలకు వినతి...
ఏపీలో 2014 ఎన్నికల సమయంలో టీడీపీ అధికారంలోకి రాగానే కాపులను బీసీలో చేరుస్తామనే హామీని చంద్రబాబు ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత హామీ నెరవేరకపోవడంతో కాపు నేతలు ముద్రగడ పద్మనాభం ఆధ్వర్యంలో భారీ ఉద్యమం చేపట్టారు. ఇది కాస్తా హింసాత్మకంగా మారడంతో తునిలో రత్నాచల్ ఎక్స్ప్రెస్ దగ్ధం కూడా జరిగింది. చివరికి కేంద్రం ఆర్ధికంగా వెనుకబడిన వర్గాలకు ప్రకటించిన పది శాతం రిజర్వేషన్లలను ఐదు శాతాన్ని చంద్రబాబు కాపులకు కేటాయించారు. ఇప్పుడు అవి కూడా అమలు కావడం లేదు. సమస్య పరిష్కారం కాకముందే కొందరు కాపు నేతల విమర్శలతో మనస్తాపం చెందిన ముద్రగడ ఉద్యమాన్ని వదిలిపెట్టేశారు.
కాపు రిజర్వేషన్ ఉద్యమాన్ని కాస్తో కూస్తో ముందుకు తీసుకెళ్లిన ముద్రగడ కొందరు నేతల వైఖరితో ఉద్యమానికి దూరం కావడంతో ఇది కాస్తా మూలనపడింది. దీంతో 13 జిల్లాలకు చెందిన కాపు జేఏసీ నేతలు ఇవాళ తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలోని ముద్రగడ పద్మనాభం ఇంటికి వెళ్లి కలిశారు. తిరిగి కాపు ఉద్యమంలోకి రావాలని ఆహ్వనించారు. కానీ ముద్రగడ మాత్రం వారి విజ్ఞప్తిని సున్నితంగా తిరస్కరించారు. శుభకార్యాలకు రమ్మంటే ఓపిక ఉన్నంతవరకూ వస్తానని, కానీ ఉద్యమం లోకి రావాలని మాత్రం ఇబ్బంది పెట్టొద్దని ముద్రగడ వారికి తేల్చి చెప్పేశారు.
గతంలో కాపు ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన ముద్రగడను తిరిగి రప్పించగలిగితే రిజర్వేషన్ల వ్యవహారంపై పోరాటం చేద్దామని భావించిన జేఏసీ నేతలకు ఆయన రాలేనని చెప్పేయడంతో ఏం చేయాలో పాలుపోవడం లేదని తెలుస్తోంది. ముద్రగడ స్ధానంలో మరో ప్రత్యామ్నాయ నేతను ఎన్నుకోవాలా లేక తామే ఉద్యమం కొనసాగించాలా అన్న దానిపై కాపు జేఏసీ త్వరలో స్పష్టత ఇవ్వనుంది.