అంతా మీరే, నేను లేఖ రాసినా చంద్రబాబు స్పందించలేదు: ముద్రగడ
కిర్లంపూడి: కాపు నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం సోమవారం మధ్యాహ్నం విలేకరులతో మాట్లాడారు. తుని ఘటనకు ప్రభుత్వానిదే బాధ్యత అని ఆరోపించారు. తమకు ఎలాంటి బాధ్యత లేదన్నారు. విధ్వంసానికి తాను పిలుపునివ్వలేదని చెప్పారు. తాను లేఖ రాసినప్పటికీ చంద్రబాబు స్పందించలేదన్నారు.
కాపులను బీసీల్లో చేర్చాలన్నది ఏళ్ల తరబడి ఉన్న డిమాండ్ అన్నారు. మా ఉద్యమం ఏ కులానికి వ్యతిరేకం కాదన్నారు. తాను రాజకీయ లబ్ధి కోసం ఉద్యమించడం లేదన్నారు. తుని ఘటనపై స్పందిస్తూ... అధికార పార్టీ నేతలే కొందరిని ప్రోత్సహించి పంపించారన్నారు. వారే పోలీసు జీపుల పైన దాడి చేశారన్నారు.
'తుని ఘటనలో జగన్ హస్తం': ఎప్పుడేం జరిగింది (పిక్చర్స్)
అలాంటి దుష్ట సంప్రదాయం తన జాతికి, తనకు లేదన్నారు. శాంతియుతంగా ఉద్యమం చేయడం తనకు మొదటి నుంచి ఉన్న అలవాటు అన్నారు. విధ్వంసానికి అధికార పార్టీ నుంచే కుట్ర జరిగిందన్నారు. ఇది చాలా దురదృష్టకరమన్నారు. రభస సృష్టించేందుకే అలా చేశారన్నారు.
దుష్టశక్తులకు నాయకత్వం వహించింది మీ నాయకుడేనని చంద్రబాబుకు ముద్రగడ చెప్పారు. ఉద్యమానికి నాయకత్వం వహించింది మాత్రం తానే అన్నారు. మీరు అబద్దాలు చెప్పి.. మా జాతి ఓట్లతో మీరు గద్దెను ఎక్కారన్నారు. మీరు ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటే మేం రోడ్డెక్కే వాళ్లం కాదన్నారు.
మీరు ఇచ్చిన వాగ్ధానాన్ని అమలు చేయడానికి బదులు తప్పించుకునేందుకు ప్రయత్నాలు చేయడం సరికాదన్నారు. చంద్రబాబు హామీల వల్ల ఎందరో మోసపోయారని, ఇప్పుడు మా జాతి కూడా మోసపోయిందన్నారు. వెయ్యి కోట్ల రూపాయలు అని చెప్పి మా జాతి ఓట్లతో అధికారంలోకి వచ్చారన్నారు.
ఇప్పుడు మమ్మల్ని తప్పుదోవ పట్టించవద్దన్నారు. అపార అనుభవం ఉన్న మీరు కాపులను బీసీలలో చేర్చుతామని ఎందుకు చెప్పారన్నారు. రైతులకు రుణమాఫీ అన్నారని, మహిళలకు రుణమాఫీ అన్నారని.. కానీ ఏవీ చేయడం లేదన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు తప్పుడు పంథాలో నడుస్తున్నారన్నారు. కాపులను బీసీల్లో చేర్చేందుకు కమిషన్ అని, సుప్రీం కోర్టు అని కారణాలు చెప్పడం విడ్డూరమన్నారు. తాను లేఖ రాసినప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించలేదన్నారు.
నాడు కోట్ల ప్రభుత్వం ఇచ్చిన జీవోలను దొంగ జీవోలు అనడం సరికాదన్నారు. రేపు మీరు ఇచ్చిన జీవోలను కూడా ఎవరైనా దొంగ జీవోలు అంటే ఎలా అని ప్రశ్నించారు. మా జాతికి న్యాయం కోసం ఉద్యమిస్తున్నామన్నారు. మా పిల్లలకు రిజర్వేషన్లు లేక ఇబ్బంది పడుతున్నారన్నారు.
ఏ పార్టీతోనూ కుమ్మక్కు కాలేదని కాణిపాకం వరసిద్ధి వినాయకుని ముందు ప్రమాణం చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ముద్రగడ అన్నారు. తాను ఒక పార్టీతో చేరానని ముఖ్యమంత్రి చంద్రబాబు కాణిపాకంలో వినాయకుని ముందు ప్రమాణం చేయగలరా? అని సవాల్ చేశారు. కాపులు ఊరికే అడగడం లేదని ఆయన చెప్పారు.
తాను ఒక్కమాట చెబితే చాలు, ఏం చేసేందుకైనా కాపులు వెనుకాడరని ముద్రగడ అన్నారు. ఆయన ఓ టీవీ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. కాపులంతా తనతోనే ఉన్నారన్నారు. అందుకే తాను కాపులు విధ్వంసానికి దిగలేదని చెబుతున్నానని అన్నారు.
తాను ఎవరికైనా 'విధ్వంసానికి దిగండి' అని చెప్పి ఉంటే, అలా జరిగి ఉండేది కానీ, తాను ఎవరికీ అలా చేయమని చెప్పలేదన్నారు. కేవలం రాస్తా రోకో, రైల్ రోకోకి మాత్రమే పిలుపునిచ్చానని చెప్పారు. తాను విధ్వంసాన్ని ప్రోత్సహించే వ్యక్తిని కాదన్నారు. కాపుల ప్రయోజనం కోసం ఏం చేసేందుకైనా సిద్ధమన్నారు.