ఆయుధాలతో సిద్దం కమ్మని పిలుపివ్వాలా?...చంద్రబాబుకు ముద్రగడ హెచ్చరిక లేఖ
కాకినాడ:కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. టిడిపి నాయకుల వ్యవహార శైలి మార్చుకోకుంటే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు.
ఆర్టీసీ బస్సులపై టిడిపి నేతల పోస్టర్లు చిరిగినందుకు దౌర్జన్యం చేస్తారా?...అలాగైతే పోస్టర్లను సొంత వాహనాలపై అంటించుకోవాలని, అప్పుడైతేనే చినగకుండా ఉంటాయని ముద్రగడ ఎద్దేవా చేశారు. ఇకపై ఇలాంటి దాడులను నిరోధించకపోతే ఆయుధాలతో సిద్ధంగా ఉండాలంటూ తమ కాపు జాతికి పిలుపునిస్తానని హెచ్చరించారు. తెలుగుదేశం పార్టీ వద్ద డబ్బు బలం ఉంటే తమ వద్ద జన బలం ఉందన్న విషయం గుర్తుంచుకోవాలని ముద్రగడ పేర్కొన్నారు.
తెలుగుదేశం పార్టీ కులాల మధ్య గొడవలు, అలజడులు రేపుతూ...అధికారం కోసం టీడీపీ ఎన్నో తమషాలు చేస్తోందని కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం సిఎం చంద్రబాబుకు రాసిన లేఖలో ఆరోపించారు. మిమ్మల్నివిమర్శించే వారి కుటుంబాలను అవమానిస్తున్నారని, మరి మీ భార్య, కోడలిపై విమర్శలు చేస్తే మీ పరిస్ధితి ఏమిటో ఒక్కసారి ఆలోచించుకోవాలంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎపిలో పోలీసు వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసి ప్రజలకు న్యాయం జరగకుండా అన్యాయం చేస్తున్నారని ముద్రగడ ఆరోపించారు.
Recommended Video
మీ జన్మదినాన ప్రత్యేక హోదా వంకతో ప్రభుత్వ ఖజానా నుండి ఖర్చు చేసిన కోట్ల రూపాయల వ్యయం వల్ల ఏం సాధించారో ప్రజలకు చెప్పాలని ముద్రగడ కోరారు. ఎదుట వ్యక్తికి వేలు చూపి విమర్శించే సమయంలో...మిగిలిన మూడు వేళ్ళు ఎవరిని చూపిస్తాయో తెలుసుకుని నడవండంటూ...ముద్రగడ పద్మనాభం చంద్రబాబుకు రాసిన లేఖలో పేర్కొన్నారు.