చిరు, పవన్ కళ్యాణ్ను అడ్డుపెట్టుకొని: బాబుపై ముద్రగడ, జైలుకు పేర్ని నాని
రాజమండ్రి: చిరంజీవి, పవన్ కళ్యాణ్లను అడ్డం పెట్టుకొని కాపు ఉద్యమాన్ని చంద్రబాబు ప్రభుత్వం పక్కదారి పట్టించే ప్రయత్నాలు చేస్తోందని మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఆరోపించారు. కాపు ఓట్లతో అధికారంలోకి వచ్చిన ఏపీ సీఎం చంద్రబాబు, ఇపుడే అదే కాపులను మోసిగించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు.
జనవరి 31న తునిలో కాపు ఐక్య గర్జన మహా సభను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కాపులను బీసీల్లో చేరుస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారని, దానిని టిడిపి ప్రభుత్వం నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందే కాపులను బిసిల్లో చేరుస్తామని చెప్పారన్నారు.
ఆ హామీని నిలబెట్టుకోనందునే కాపులు నిరసన వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. కాపుల సంక్షేమానికి పెద్ద పీట వేస్తామని చెప్పిన చంద్రబాబు కాలయాపన చేస్తున్నారన్నారు. ఆర్థికంగా వెనుకబడిన కాపు కులస్తులకు రిజర్వేషన్ ఫలితాలు దక్కాలనే ఉద్దేశ్యంతోనే ఐక్య గర్జన నిర్వహిస్తున్నట్లు చెప్పారు. చంద్రబాబు ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు తమ పోరాటం ఆగదన్నారు.
పేర్ని నాని అరెస్ట్, రిమాండ్
బందర్ పోర్టు భూసేకరణ, ఎక్సైజ్ అధికారుల వేధింపులకు నిరసనగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత పేర్ని నాని ధర్నా చేపట్టారు. ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. పేర్ని నానిని పోలీసులు కోర్టుకు తరలించారు. కోర్టు ఆయనకు ఈ నెల 27వ తేదీ వరకు రిమాండు విధించింది.
పరిశ్రమలకు భూసేకరణ కోసం ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్కు నిరసనంగా మచిలీపట్నంలో జరిగిన రెవెన్యూ సదస్సును అడ్డుకోవడంతో పాటు, ఎస్సైని దూషించాడన్న కారణంతో పేర్ని నానిని పోలీసులు అరెస్టు చేశారు. ఆయన బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురైంది. ఆయనను సబ్ జైలుకు తరలిస్తారు. అంతకుముందు, వైసిపి ఎమ్మెల్యే కొడాలి నానిని కూడా పోలీసులు అరెస్ట్ చేసి వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు.