చంద్రబాబుతో అమీతుమీకి ముద్రగడ రెడీ! : అస్త్రం సిద్దం, ఎక్కుపెట్టడమే ఆలస్యం!?
కాకినాడ : తుని విధ్వంస ఘటన తర్వాత.. కాపు ఉద్యమాన్ని శాంతియుత పంథాలో సమయోచితంగా నడిపేందుకు ముద్రగడ ప్రయత్నిస్తున్నారు. ఇంతకుముందులా తక్షణ నిర్ణయాలు కాకుండా.. సమగ్ర చర్చల ద్వారా నేతలతో భేటీల ద్వారా పక్కా వ్యూహాలను రచించే పనిలో పడ్డారు. ఇదే క్రమంలో.. కాపు నేతలను, కాపు ప్రజలను ఐక్యం చేసేందుకు ఆయన త్వరలోనే పాదయాత్ర ప్రారంభించబోతున్నారన్న అంశం ప్రస్తుతం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ముద్రగడ పాదయాత్ర ప్రస్తుతానికి అంతర్గతంగా వినిపిస్తున్న మాటే అయినప్పటికీ.. దీని వెనకాల పెద్ద ప్లానే వేస్తున్నట్టు అర్థమవుతోంది. ముఖ్యంగా పాదయాత్రల ద్వారా ఎక్కువమంది కాపు ప్రజలను ఉద్యమంతో మమేకం చేయడంతో పాటు.. ముద్రగడపైనా ఇతర కాపు నేతలపైనా విమర్శలు ఎక్కుపెడుతోన్న అధికార పార్టీ కాపు నేతలను ఏకాకులను చేయాలన్న ఆలోచనలో ఉన్నారు ముద్రగడ.
అధికార పార్టీలో ఎవరైతే ముద్రగడను గానీ కాపు ఉద్యమాన్ని గానీ అణిచేసే రీతిలో వ్యాఖ్యలు చేస్తారో.. సదరు నేతలకు వచ్చే ఎన్నికల్లో కాపు ప్రజల మద్దతును దూరం చేసేందుకు ముద్రగడ ఎత్తుగడ వేస్తున్నారు. తద్వారా తమపై వచ్చే విమర్శలకు ఫుల్ స్టాప్ పెట్టాలనేది ముద్రగడ భావన. ఇక పాదయాత్ర ద్వారా రాష్ట్రంలోని ప్రతీ పల్లెను పట్టణాన్ని కదిలించాలనే ఉద్దేశంతో ముద్రగడ పాదయాత్ర వ్యూహానికి పదును పెడుతున్నట్లుగా తెలుస్తోంది.
మొన్నటి రాజమండ్రి కాపు జేఏసీ సమావేశంలో కాపు నేతల నుంచి స్వీకరించిన కొన్ని సలహాలు, సూచనలను పరిగణలోకి తీసుకుని ఈ పాదయాత్ర వ్యూహాన్ని తెరపైకి తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇదే విషయంపై ఈ నెల 25,26 తేదీల్లో దాసరి ఇంట్లో జరగబోయే జేఏసీ సమావేశం తర్వాత ఈ విషయాలన్నింటి పైనా పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
పాదయాత్రతో పాటు ప్రతీ వారం ఓ వినూత్న నిరసనతో ప్రభుత్వానికి కాపు ఉద్యమ సెగ తగిలేలా ముద్రగడ ప్లాన్ చేస్తున్నట్టుగా కాపు నేతల్లో చర్చ జరుగుతోంది. ఇక అన్నింటికి మించి టీడీపీలో ఉన్న అసంతృప్త నేతలను కాపు ఉద్యమంలోకి తీసుకొచ్చేందుకు కూడా తెరవెనుక ప్రయత్నాలు మొదలయ్యాయనే వాదన వినిపిస్తోంది. ఏదేమైనా సీఎం చంద్రబాబుతో అమీ తుమీ తేల్చుకోవడానికి ముద్రగడ సిద్దమయ్యారు. అందుకోసం పాదయాత్ర అస్త్రాన్నే ఎక్కుపెడుతారా..? లేక ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి మరో కొత్త వ్యూహాం ఎంచుకుంటారా..? అన్నది మరికొద్ది రోజుల్లో తేలిపోనుంది.