టిడిపి ఎన్నికల పోరు ప్రారంభానికి ముహుర్తం ఫిక్స్...సెప్టెంబర్ 1న కాకినాడలో సమర శంఖారావం
తూర్పు గోదావరి:తెలుగుదేశం పార్టీ రాబోయే సార్వత్రిక ఎన్నికల పోరుకు సమాయత్తం అవుతోంది. ఎలక్షన్ వార్ ప్రారంభానికి ముహుర్తం కూడా ఫిక్స్ చేసేసింది. సెప్టెంబర్ 1 న కాకినాడలో జరిగే టిడిపి తూర్పు గోదావరి జిల్లా విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో ఆ పార్టీ తొలి నగారా మోగించనుంది.
పార్టీ కేడర్ ను కదనరంగానికి సన్నద్దం చేసేందుకు గాను స్వయంగా టిడిపి అధినేత చంద్రబాబునాయుడే ఈ సమావేశంలో పాల్గొంటారని తెలిసింది. అంతేకాదు ఏకంగా 10 వేల మంది కార్యకర్తలు పాల్గొనే ఈ సమావేశానికి కాకినాడ ఆనంద భారతి గ్రౌండ్స్ వేదిక కానుంది. ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా చంద్రబాబునాయుడు హాజరై పార్టీ కేడర్ కు దిశానిర్దేశం చేయనున్నారు.
కాకినాడలో సెప్టెంబర్ 1 న జరిగే టిడిపి కార్యకర్తల సమావేశానికి తూర్పు గోదావరి జిల్లాలో బూత్ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు వివిధ కేటగిరీలలో పార్టీ పదవులలో ఉన్న వారంతా హాజరుకావాలని జిల్లా పార్టీ నేతల నుంచి ఇప్పటికే పిలుపులు వెళ్లాయి. ప్రతి కార్యకర్తా తప్పనిసరిగా పసుపు చొక్కాతో హాజరుకావాలని నేతలు హెచ్చరించారు. గ్రామ పార్టీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, మండల పార్టీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు, జిల్లా సమన్వయ కమిటీ, జిల్లా పార్టీ కమిటీ, అనుబంధ సంఘాల సభ్యులు, జిల్లాకు చెందిన రాష్ట్ర పార్టీ కమిటీ సభ్యులు ఈ సమావేశానికి రానున్నారు.
సెప్టెంబరు 1 శనివారం ఉదయం 10 గంటల నుంచి 2 గంటల వరకు ఈ సమావేశం నిర్వహించనున్నారు. జిల్లాలోని ఒక్కో నియోజకవర్గం నుంచి అన్ని స్థాయిల నేతలు,కార్యకర్తలు కనీసం 700 మంది చొప్పున విస్తృత స్థాయి సమావేశానికి హాజరవ్వాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు తెలిసింది. ఇలా మొత్తం 19 నియోజకవర్గాల నుంచి 11 వేల పైచిలుకు కార్యకర్తలు హాజరుకావాల్సి ఉంది. ఆ క్రమంలో పది వేలమంది కార్యకర్తలకు తగ్గకుండా హాజరవుతారని టిడిపి జిల్లా నేతలు అంచనా వేస్తున్నారు.
టిడిపి అధికారికంగా ఈ విషయం ప్రకటించకున్నా ఖచ్చితంగా వచ్చే 2019 సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని టీడీపీ ఈ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసినట్లు రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మరో ఆరేడు నెలల్లో ఎన్నికలు జరగవచ్చని భావిస్తున్న తరుణంలో టిడిపి ముందుగానే సమరభేరికి సన్నాహాలు చేస్తోందంటున్నారు. కారణం...ఎన్నికలలోగా ఈ జిల్లా పర్యటనకు సీఎం చంద్రబాబు మరోసారి వచ్చినా ఇలా కార్యకర్తలను అందరినీ ఉద్దేశించి మాట్లాడే అవకాశం ఉండకపోవచ్చన్న ఉద్దేశంతో సీఎం తూర్పుగోదావరి జిల్లా పర్యటన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు భావిస్తున్నారు.
కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో నేతలే ప్రసంగాలతో ఊదరగొట్టడం కాకుండా నియోజకవర్గానికి ఇద్దరి, ముగ్గురు కార్యకర్తలతో మాట్లాడించాలని నిర్ణయించారు. ఈ సమావేశాన్ని విజయవంతం చేయడం ద్వారా జిల్లా పార్టీ కేడర్తో పాటు రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం తీసుకువచ్చేందుకే టిడిపి అధినేత చంద్రబాబు ఈ సమావేశంలో పాల్గొనే ఏర్పాట్లు చేసినట్టు జిల్లా పార్టీ నాయకులు చెబుతున్నారు.