కలకలం:విజయవాడలో "ముజ్రా డ్యాన్సులు"...ఐదుగురు యువతులతో సహా 58 మంది అరెస్ట్
విజయవాడ:విజయవాడకు కూడా "ముజ్రా డ్యాన్సుల" విష సంస్కృతి పాకేసిందా?...అంటే తాజాగా వెలుగు చూసిన ఉదంతంతో అవుననే చెప్పకతప్పదు. డ్యాన్స్ ల పేరిట అత్యంత అసభ్యకర రీతిలో సాగే ఈ తంతు సమాజాన్ని భ్రష్టు పట్టించడంలో ముందుంటుందని సామాజికవేత్తల విశ్లేషణ.
మరి విజయవాడలో ఈ "ముజ్రా డ్యాన్సులు" ఎప్పుడు మొదలయ్యాయి...ఎలా మొదలయ్యాయో...దీనివెనుక ఎవరున్నారో తెలియదు...కానీ...తాజాగా భవానీపురంలోని ఓ హోటల్లో నిర్వహిస్తున్న ముజ్రా డ్యాన్సులపై టాస్క్ఫోర్స్ పోలీసులు గురువారం దాడులు చేసి భారీ సంఖ్యలో పురుషులనీ, కొందరు యువతుల్నీ అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ హోటల్ ఎమ్మెల్యే బొండా ఉమాది కాగా ఆయన వేరొకరికి లీజుకు ఇచ్చినట్లు చెబుతుండటం గమనార్హం.
ముజ్రా డ్యాన్స్...హుషారు...
సమయం రాత్రి 11 గంటలు...దమ్మారో దమ్...మసక మసక చీకట్లో లాంటి పాటలకు అర్థనగ్నంగా...ఆ తరువాత నగ్నంగా అమ్మాయిలు స్టెప్పులేస్తూ...తమతో వేయిస్తుంటే...చేతిలోని మద్యం గ్లాసు మత్తుకు ఈ మషాలా కిక్ తోడై వెర్రెక్కిపోతూ...మగాళ్లే మదగజాలను తలపిస్తూ చిందులేస్తున్నారు. ఇదీ...తమకు అందిన పక్కా సమాచారం మేరకు ఓ హోటల్ పై దాడి జరిపిన టాస్క్ ఫోర్స్ పోలీసులకు కనిపించిన దృశ్యం. ఇది ఎక్కడో ఏ కాస్మోపాలిటన్ నగరంలో జరిగిన ముజ్రా పార్టీ అయివుంటుందనుకుంటున్నారేమో...కానే కాదు...మన బెడవాడలోని భవానీపురంలోని ఆలివ్ ట్రీ హోటల్ లోనే చోటుచేసుకున్న భాగోతమిది.
రేట్లు...ఫీట్లు...వృద్దులు సైతం
బుధవారం అర్థరాత్రి భవానీపురంలోని ఆలివ్ ట్రీ హోటల్లో ముజ్రా పార్టీ ఏర్పాటు చేశారు. ఏలూరు, భీమవరం, హైదరాబాద్, విజయవాడకు చెందిన యువతులను తీసుకొచ్చారు. భారీస్థాయిలో మద్యాన్ని డంప్ చేశారు. పార్టీలో పాల్గొనే వారికి రూ.2వేలను ప్రవేశ రుసుంగా నిర్ణయించారు. భోజనానికి అదనంగా రూ.750లు వసూలు చేశారు. రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 4గంటల వరకు టైమ్ ఫిక్స్ చేశారు. హోటల్లో పెద్ద హాలులో అమ్మాయిలను నగ్నంగా వేదిక ఎక్కించి డ్యాన్స్లు వేయించారు. మందు గ్లాసులతో వయసుతో సంబంధం లేకుండా పార్టీలో పాల్గొన్న 20 నుంచి 70 ఏళ్ల వారంతా చిందులు వేశారు. వచ్చిన వారిలో అన్నదమ్ములు, మామ అల్లుళ్లు, తండ్రీకొడుకులు కలిసి...అమ్మాయిలతో డ్యాన్స్లు వేశారు. అరెస్ట్ అయిన వారిలో వృద్దల సంఖ్యే ఎక్కువంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
ప్రతి నెలా...నిర్వహణ...
భవానీపురంలోని ఈ హోటల్లో ప్రతి నెలా ముజ్రా పార్టీలను నిర్వహిస్తున్నట్లుగా పోలీసుల విచారణలో తేలింది. ‘వి' గ్రూపు కిట్టీ పార్టీ పేరుతో ప్రతి నెలా బుధవారం రాత్రి సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని...ఇందులో మద్యం, రాత్రి విందు, అశ్లీల నృత్యాల కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లుగా తేలింది. వివిధ జిల్లాల నుంచి యువతులను తీసుకుని వచ్చి అసభ్యకరమైన నృత్యాలు చేయిస్తుంటారు. పట్టుబడిన వారిలో ఎమ్మెల్యే బోండా ఉమకు చెందిన ఈ హోటల్ను లీజుకు తీసుకొని నడిపిస్తున్న సూర్యారావు పేటకు చెందిన టిడిపి నేత సానా చైతన్య, 47వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు కొల్లూరు రామకృష్ణ, పాటు పలువురు స్థానిక టీడీపీ నేతలు, తెలుగు యువత నేతలు, వ్యాపారులు ఉన్నారని చెబుతున్నారు.
టాస్క్ ఫోర్స్ దాడితో...బట్టబయలు
ఆ హోటల్ పై టాస్క్ఫోర్స్ దాడుల్లో 53 మంది పురుషులు, ఐదుగురు యువతులను అదుపులోకి తీసుకుని రూ.4.50లక్షల నగదును, కార్లు, మోటారు సైకిళ్లు స్వాధీనం చేసుకున్నారు. యువతులను వాసవ్య మహిళా మండలికి తరలించారు. దీనిపై పోలీసులు ఐపీసీ 370, 354 సెక్షన్లు కింద.. అనుమతి లేకుండా మద్యం డంప్ చేయడంపైనా కేసులు నమోదు చేశారు. యువతుల్లో ముగ్గురు తునికి చెందిన వారు, మిగిలిన ఇద్దరు విజయవాడ, హైదరాబాద్కు చెందిన వారుగా పోలీసులు పేర్కొన్నారు. యువతులను నగరంలోని మహిళా హోంకు పంపించారు. మిగిలిన వారిని గురువారం సాయంత్రం వారిని న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు.
నిబంధనలు...అన్నీ తోసిరాజని...
ఈ హోటల్లో మద్యం తాగేందుకు అనుమతులు లేకపోయినా సరఫరా చేశారు. హోటల్లో పార్టీలు ఏవైనా 10:30కే ఆపేయాలి. అయినా ఇక్కడ అర్ధరాత్రి వరకు నిర్వహించారు. ముఖ్యంగా యువతులతో అశ్లీల నృత్యాలు చేయించినట్లుగా పోలీసుల విచారణలో తేలింది. ఈ విషయమై నగర జాయింట్ పోలీస్ కమిషనర్ కాంతిరాణా మాట్లాడుతూ.. ఈ కార్యక్రమంతో రాజకీయ నేతలకు ఎటువంటి సంబంధం లేదని చెప్పారు. హోటల్, పార్టీ నిర్వాహకులపై కఠిన సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామన్నారు. ఈ కేసుకు సంబంధించి ఇద్దరు ఆర్గనైజర్లను అదుపులోకి తీసుకున్నామన్నారు. ఒక్కొక్కరి నుంచి రూ. 3 వేలు చొప్పున వసూలు చేసినట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. మద్యం తీసుకునేందుకు కూడా అనుమతి లేదన్నారు. దీనిపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.