నత్వానీ ఇష్యూలో కొత్త ట్విస్ట్: జగన్ ఇలా ఫిక్స్ చేసేశారు: ఇక..ట్రబుల్ షూటర్ సీఎం చేతిలోనే...!
ఏపీ నుండి ఖాళీ అయిన నాలుగు రాజ్యసభ స్థానాలకు వైసీపీ అభ్యర్ధులను ఖరారు చేసింది. ప్రముఖ పారిశ్రామిక వేత్త ముఖేష్ అంబానీ స్వయంగా సీఎం జగన్ నివాసానికి వచ్చి తన మిత్రుడు నత్వానీకి వైసీపీ కోటా నుండి రాజ్యసభ అవకాశం ఇవ్వాలని కోరారు. అప్పటికే అమిత్ షా సైతం ఇదే రకమైన సిఫార్సు చేయటంతో పార్టీ నేతలతో మంతనాల తరువాత జగన్ తమ పార్టీలో ఒకరిని పక్కన పెట్టి మరీ నత్వానీకీ రాజ్యసభ ఖరారు చేశారు. అయితే, ఏకగ్రీవం అవుతాయని భావించిన సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు తమ పార్టీ నుండి వర్ల రామయ్య రాజ్యసభ అభ్యర్ధిగా బరిలో నిలుస్తారని ప్రకటించటంతో ఇప్పుడు ఎన్నిక అనివార్యంగా కనిపిస్తోంది.
అయితే, ఇదే సమయంలో ముఖ్యమంత్రి జగన్ పొలిటికల్ అండ్ ఇండస్ట్రియల్ ట్రబుల్ షూటర్ పరిమళ్ నత్వానీనీ వ్యూహాత్మకంగా ఫిక్స్ చేసేశారు. రాజ్యసభ సభ్యుడిగా బీ ఫారం ఇవ్వటంతో పాటుగా..జగన్ వేసిన ఎత్తుగడతో ఇప్పుడు కొత్త సమీకరణ తెర మీదకు వచ్చింది. ఇక, నత్వానీ సైతం జగన్ కు జై కొట్టాల్సిందేనా అనే చర్చ మొదలైంది.
నత్వానీ స్వతంత్ర అభ్యర్ధి కాదా..
వైసీపీ నుండి నలుగురు రాజ్యసభ సభ్యులను ప్రకటించారు. ఆ నలుగురు ముఖ్యమంత్రి జగన్ తో సమావేశమయ్యారు. వారికి సీఎం బీఫారంలు అందచేయటంతో..నలుగురూ ఒకేసారి అసెంబ్లీ కార్యదర్శి వద్ద తమ నామినేషన్లు దాఖలు చేశారు. అయితే, పరిమళ్ నత్వానీ వైసీపీ మద్దతుగా స్వతంత్ర సభ్యుడిగా రాజ్యసభకు ఎంపిక అవుతున్నారని ఇప్పటి వరకు ప్రచారం సాగింది. మిగిలన ముగ్గురు మాత్రమే అధికారికంగా వైసీపీ సభ్యులుగా ఉంటారని..దీంతో ఇప్పటికే రాజ్యసభలో ఉన్న ఇద్దరు సభ్యులతో కలిసి వైసీపీ బలం అయిదుకు చేరుతుందని పార్టీ నేతలే లెక్కలు చెప్పారు.
నత్వానీ మెడలో వైసీపీ కండువా
అనూహ్యంగా ముఖ్యమంత్రి జగన్ తన క్యాంపు కార్యాలయంలో నలుగురు రాజ్యసభ అభ్యర్దులకు బీ ఫారం ఇచ్చే సమయంలో నత్వానీ మెడలో పార్టీ కండువా వేసి..అధికారికంగా ఆయన్ను సైతం వైసీపీ సభ్యుడిగానే మిగిలిన ముగ్గురితో పాటుగా పరిగణించారు. పారిశ్రామిక వేత్తగా ఉన్న నత్వానీ మెడలో వైసీపీ కండువా స్వయంగా పార్టీ అధినేతగా ఉన్న జగన్ వ్యూహాత్మకంగానే వేసి..పైకి చెప్పకపోయినా ఆయన్ను వైసీపీలో చేరినట్లుగా ఫిక్స్ చేసినట్లు కనిపిస్తోందనే విశ్లేషణలు మొదలయ్యాయి.
Recommended Video
జగన్..అంబానీ..కేంద్రం మధ్యలో నత్వానీ...
ఇక, ఇప్పుడు ఒక రకంగా వైసీపీ మద్దతుతో స్వతంత్ర అభ్యర్ధిగా రాజ్యసభకు నత్వానీ ఎన్నికవుతారని భావించినా..తాజా పరిణామాలు లోతుగా పరిశీలిస్తే ఆయన అధికారికంగా వైసీపీ అభ్యర్ధిగానే పెద్దల సభలో కాలు పెడుతున్నారా అనే చర్చ మొదలైంది. అదే వైసీపీ నేతలు ఖరారు చేస్తే..నత్వానీ ఏపీ సీఎం జగన్ కోసం కీలక భూమిక పోషించాల్సి ఉంటుంది. అటు పారిశ్రామికంగానే కాకుండా..ఇటు కేంద్ర పెద్దలతో ఉన్న సన్నిహిత సంబంధాల కారణంగా కేంద్రంకు ఏపీకి, కేంద్ర పెద్దలు..సీఎం జగన్ మధ్య వారధిగా వ్యవహరించాల్సి బాధ్యత ఏర్పడింది. అయితే, ఇప్పటికే నత్వానీ సైతం తాను ఏపీ డెవలప్ మెంట్ కోసం పూర్తిగా ఫోకస్ చేస్తానని హామీ ఇచ్చారు. ఇక, ఇప్పుడు నామినేషన్ల ప్రక్రియ సైతం ముగియటం.. ఒక వేళ ఓటింగ్ జరిగినా..ఈ నలుగురే రాజ్యసభకు ఎన్నిక కావటం ఖాయంగా కనిపిస్తోంది. అయితే, వైసీపీ కండువాతో నత్వానీ కనిపించటం ఇప్పుడు జాతీయ స్థాయిలోనూ చర్చకు కారణమయ్యే అవకాశం ఉంది.