వైఎస్సార్ను రిలయన్స్ చంపించిందని.. అంబానీతో సీఎం జగన్ మంతనాలు.. ఏపీలో హాట్ టాపిక్ ఇదే..
గతంలో కాంగ్రెస్ ఎంపీగా ఉన్న వైఎస్ జగన్కు పార్టీ అధిష్టానంతో విభేదాలు రావడానికి.. తర్వాతి కాలంలో వైసీపీ పార్టీ పుట్టుకురావడానికి దారితీసిన ముఖ్యమైన ఘట్టం.. మహానేత వైఎస్సార్ మరణం. 2009లో రెండో సారి ముఖ్యమంత్రిగా గెలిచిన కొద్దిరోజులకే వైఎస్సార్.. అనుమానాస్పదరీతిలో హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు. ఆవెంటనే వైఎస్సార్ మరణం వెనుక అంబానీ సోదరుల హస్తం ఉందంటూ వార్తలు రావడంతో.. వైఎస్సార్, వైస్ జగన్ అభిమానులు రిలయన్స్ సంస్థకు చెందిన పెట్రోల్ బంకులు, ఇతర ఆస్తులపై దాడులు చేయడం తెలిసిందే. పాత ఘటనల నేపథ్యంలో తాజాగా ఏపీ సీఎం వైఎస్ జగన్ ను రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ కలవడం ఏపీలో చర్చనీయాంశమైంది.
పరిమళ్ కోసమే వచ్చారా?
తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీసులో ఏపీ సీఎం జగన్, రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ మధ్య దాదాపు గంటన్నరపాటు మంతనాలు సాగాయి. అంబానీ వెంట ఆయన కొడుకు అనంత్, రాజ్యసభ ఎంపీ పరిమళ్ నత్వానీ రాగా, వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కూడా భేటీలో పాల్గొన్నారు. ఏపీలో కొత్త పరిశ్రమల ఏర్పాటు, ఇప్పుడున్నవాటి విస్తరణ గురించి మాట్లాడేందుకే అంబానీ వచ్చారని వైసీపీ ప్రకటించింది. అయితే దీనివెనుక రాజకీయ కారణాలు కూడా ఉన్నాయని, రిలయన్స్ కంపెనీలో అంబానీ తర్వాత అత్యంత ముఖ్యమైన వ్యక్తి పరిమళ్ నత్వానీని.. వైసీపీ కోటాలో మళ్లీ రాజ్యసభకు పంపే అంశంపైనా చర్చ జరిగినట్లు తెలిసింది.
పాత విషయాల్ని తిరగదోడారు..
వైఎస్ జగన్ సీఎం అయిన తర్వాత వైసీపీ నేతల బెదిరింపుల కారణంగా ఏపీ నుంచి కియా లాంటి పరిశ్రమలు వెనక్కి వెళ్లిపోతున్నాయని ప్రతిపక్ష టీడీపీ తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తుండటం.. వివిధ దేశాలతో గత టీడీపీ ప్రభుత్వం చేసుకున్న పబ్లిక్ ప్రైవేటు అగ్రిమెంట్ల(పీపీఏ)ను వైసీపీ ప్రభుత్వం రద్దు చేయడంపై ఆయా దేశాల రాయబారులు అసంతృప్తి వ్యక్తం చేయడం.. దీనిపై కేంద్రం కూడా ఆగ్రహం వ్యక్తం చేసిందన్న వార్తల నేపథ్యంలో రిలయన్స్ అధినేత తాడేపల్లి పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. జగన్ సీఎం అయిన తర్వాత ఏపీకి వచ్చిన బడా పారిశ్రామిక వేత్త అంబానీనే కావడం గమనార్హం. అయితే వీళ్ల భేటీ సందర్భంగా సోషల్ మీడియాలో పాత విషయాలు ట్రెండ్ అయ్యాయి. వైఎస్సార్ మరణంతో రిలయన్స్ లింకుల్ని నెటిజన్లు తిరగదోడారు.
కేజీ బేసిన్లో గ్యాస్ కోసం వైఎస్సార్ హత్య?
జగన్-అంబానీల భేటీపై సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ జరిగింది. వైఎస్ మరణం వెనుక ‘రిలయన్స్' హస్తముందంటూ రష్యాకు చెందిన ‘ది ఎక్సైల్డ్' అనే మేగజైన్ గతంలో ప్రచురించిన కథనం శనివారం మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చింది. ఏపీలో కృష్ణా-గోదావరి బేసిన్(కేజీబీ)లో అపారమైన గ్యాస్ నిక్షేపాలను రిలయన్స్ సొంతానికి వెలికి తీయాలనుకుందని.. అందుకు అడ్డు చెప్పడంతో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్సార్ ను రిలయన్స్ పథకం ప్రకారం అడ్డుతప్పించుకుందని రష్యన్ మేగజైన్ కథనంలో పేర్కొన్నారు. ఆ తర్వాత..
రిలయన్స్ పై వైఎస్ అభిమానుల దాడులు..
‘ది ఎక్సైల్డ్' పత్రిక కథనం తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా భయానక పరిస్థితులు తలెత్తాయి. వైఎస్సార్ మరణానికి అంబానీ సోదరులతో లింకుందన్న వార్తలను జగన్ మీడియా ప్రముఖంగా ప్రచురించడంతో వైఎస్ అభిమానులు రెచ్చిపోయారు.రాష్ట్రవ్యాప్తంగా అనేకచోట్ల రిలయన్స్ పెట్రోల్ బంకులు, రిటైల్ షాపులు, ఇతర ఆస్తులపై వైఎస్ ఫ్యాన్స్ దాడులు చేశారు. దీనిపై రిలయన్స్ ఏమందంటే..
హానికరమైన తప్పుడు పని..
వైఎస్సార్ మరణంతో రిలయన్స్ సంస్థకు లింకుందరూ రష్యా పత్రిక రాసిన కథనంపై, రిలయన్స్ ఆస్తులపై వైఎస్ అభిమానుల దాడులపై ముఖేశ్ అంబానీ, అనిల్ అంబానీ విడివిడిగా స్పందించారు. వైఎస్ మరణంతో రిలయన్స్ కు సంబంధాలు అంటగట్టం దారుణమని, వ్యాపారంలో దెబ్బతీయడానికి ప్రత్యర్థులు చేసిన హానికారక తప్పుడుపనిగా దీన్ని గుర్తించామని ముఖేశ్ అంబానీ చెప్పారు. అనిల్ అంబానీ అయితే మరో అడుగుముందుకేసి.. సదరు రష్యన్ పత్రికపై పరువునష్టం దావా వేస్తాననీ హెచ్చరించారు. కాలక్రమంలో ఈ వార్తలు ఉద్రిక్తత తగ్గిపోవడంతో అందరూ ఆ విషయాన్ని వదిలేశారు. శనివారం నాటి భేటీతో మళ్లీ ఇవన్నీ చర్చనీయాంశాలయ్యాయి.
వైఎస్ హత్యపై వైసీపీ స్టాండేంటి?
వైఎస్సార్ మరణంపై వైఎస్ జగన్ కూడా అనుమానాలు వ్యక్తం చేశారు. నేరుగా రిలయన్స్ పేరును ప్రస్తావించనప్పటికీ.. హెలికాప్టర్ కూలిన ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. వైసీపీ ఏర్పడిన తర్వాత కూడా ఆ పార్టీ చాలాకాలంపాటు ఆ డిమాండ్ ను లేవనెత్తుతూ వచ్చింది. వైఎస్సార్ మరణంతో రిలయన్స్ కు లింకు లేదని పార్టీ నమ్ముతున్నట్లు ఎక్కడా ప్రకటన రాలేదు. దీంతో ఈ విషయంలో పార్టీ స్టాండ్ ఏంటో మరోసారి స్పష్టం చేయాలని నెటిజన్లు అభిప్రాయపడ్డారు. మొత్తంగా సీఎం జగన్ తో ముఖేశ్ అంబానీ భేటీ వ్యవహారం ఏపీలో హాట్ టాపిక్ అయింది.