అమరావతికి నేడు ముఖేష్ అంబానీ రాక...సిఎంతో కీలక సమావేశం!
అమరావతి: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ మంగళవారం సాయంత్రం ఎపి రాజధాని అమరావతికి రానున్నారు. ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులకు సంబంధించి సిఎం చంద్రబాబుతో ఆయన సమావేశం కానున్నారు.
మంత్రి నారా లోకేష్ ఇటీవల ముంబై వెళ్లి ఎపిలో పెట్టుబడులకు గల అవకాశాలను ముఖేష్ అంబానీకి వివరించి రాష్టానికి రావాలని ఆహ్వానించిన నేపథ్యంలో అంబానీ ఈ పర్యటనకు విచ్చేస్తున్నట్లు తెలిసింది. అందువల్ల ముఖ్యమంత్రి చంద్రబాబు, ముఖేష్ అంబానీల సమావేశంలో ఐటి మంత్రి లోకేష్ కూడా పాల్గొంటారని సమాచారం.
నేడు అమరావతి పర్యటనకు విచ్చేయనున్న రిలయన్స్ అధినేత ముఖేష్...ఈరోజు సాయంత్రం దాదాపు రెండు గంటల పాటు సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అవుతారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించి వీరి మధ్య కీలక చర్చలు జరగనున్నాయి. ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్తో పాటు ఎపి ఇతర ఉన్నతాధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గోనున్నారు.
ఈ సమావేశం అనంతరం సచివాలయంలో ఏర్పాటు చేసిన రియల్ టైమ్ గవర్నెన్స్ కేంద్రాన్నిముఖేష్ అంబానీ పరిశీలిస్తారు. తదనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసంలో జరిగే విందు భేటీలోనూ ముఖేష్ అంబానీ పాల్గొనే అవకాశం ఉన్నట్లు సమాచారం.