మున్సిపోల్స్ .. ప్రత్యర్ధి అభ్యర్థులకు వైసీపీ నేతల ప్రలోభాల ఎర .. డిఫెన్స్ లో ప్రతిపక్షాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మార్చి 10వ తేదీన జరుగనున్న మునిసిపల్ ఎన్నికలకు అన్ని రాజకీయ పార్టీలు వ్యూహాత్మకంగా పావులు కదులుతున్నాయి. పార్టీ గుర్తు మీద పోటీ చేస్తే ఎన్నికలు కావడంతో సత్తా చాటాలని ప్రయత్నిస్తున్న పార్టీలు, బలమైన అభ్యర్థులనే ఎన్నికల బరిలోకి దించాయి . సాధారణంగా ఎన్నికలలో ఓటర్లకు గాలం వేస్తూ, వారికి డబ్బు ఆశ చూపి ఓట్లు వేయించుకోవడానికి అభ్యర్థులు ప్రయత్నిస్తుంటారు. కానీ ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బరిలోకి దిగిన ప్రత్యర్థి అభ్యర్థులను టార్గెట్ చేసి బేరసారాలు సాగుతున్నాయి.
కౌన్సిలర్, కార్పొరేటర్ లుగా బరిలోకి దిగిన వారికి బంపర్ ఆఫర్లు
కౌన్సిలర్, కార్పొరేటర్ లుగా బరిలోకి దిగిన వారికి ఆఫర్ల మీద ఆఫర్లు అందుతున్నాయి. ముఖ్యంగా అభ్యర్థులను లాగేయడం కోసం అధికార పక్షం నేతలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక విపక్ష పార్టీలు తమ అభ్యర్థులను పోటీలో ఉంచడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. మీరెలానూ గెలవరు, మేము ఇచ్చింది తీసుకుని పోటీ నుంచి వైదొలగాలని అధికార వైసీపీ నేతలు ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులకు ఆఫర్ ఇస్తున్నారు. తమకేం కావాలో అడగాలని సూచిస్తున్నారు.
నందిగామలో టీడీపీ అభ్యర్థులను రహస్య ప్రాంతానికి తరలింపు
దీంతో ప్రతిపక్ష పార్టీ నేతలను కాపాడుకోవడం ఆయా పార్టీలకు తలనొప్పిగా తయారైంది . నందిగామ నగర పంచాయతీ లో ఏకంగా తమ అభ్యర్థులను కాపాడుకోవడం కోసం టిడిపి నేతలు వారిని రహస్య ప్రాంతానికి తీసుకెళ్లారు అంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు . ఎక్కడ తమ అభ్యర్థులను ప్రలోభపెట్ట వారితో నామినేషన్లు ఉపసంహరించుకునేలా చేస్తారో అన్న అనుమానంతో 20 మంది అభ్యర్థులతో టిడిపి నేతలు రహస్య ప్రాంతానికి వెళ్లడం రాష్ట్రంలో తాజా పరిస్థితికి అద్దం పడుతుంది.
చాలా చోట్ల నామినేషన్లు ఉపసంహరించుకుంటున్న ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు
ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల టిడిపి నుంచి ఇతర పార్టీల నుంచి బరిలోకి దిగిన అభ్యర్థులు, ఒక్కొక్కరుగా వైసీపీ నేతల ప్రలోభాలకు లోనై నామినేషన్లను ఉపసంహరించుకుంటున్నారు. నూజివీడు మున్సిపాలిటీ లో కూడా విపక్ష పార్టీల నుండి బలమైన అభ్యర్థులు ఉపసంహరింప చేసుకోవడం కోసం అధికార పార్టీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఏది ఏమైనా నేరుగా అభ్యర్థులనే ప్రలోభ పెడుతున్న తాజా పరిణామాలు ప్రతిపక్ష పార్టీలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ప్రతిపక్ష పార్టీలను స్వీయ రక్షణలో పడేశాయి .
అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మక ఎన్నికలు .. పై చెయ్యి ఎవరిదో
ప్రధాన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులను ప్రలోభ పెట్టడమే కాకుండా, ఎన్నికల ప్రచారంలో సైతం హోరాహోరీగా తలపడ్డారు. వ్యూహాత్మకంగా ముందుకు వెళుతున్నారు. అన్ని రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న ఈ ఎన్నికలలో ఎవరిది పై చేయిగా ఉంటుందన్నది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆసక్తికరంగా మారింది.