మున్సిపల్ వార్ ... రాజకీయ పార్టీల నేతలతో, అధికారులతో ఎస్ఈసి ప్రాంతీయ సమావేశాలు
పంచాయతీ ఎన్నికల ప్రక్రియను పూర్తిచేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ కు కావలసిన ఏర్పాట్లు చేసుకుంటోంది. ఇందులో భాగంగా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నేతలతో సమావేశం కావాలని నిర్ణయం తీసుకుంది.మున్సిపల్ ఎన్నికలపై ప్రాంతాలవారీగా సమావేశాలకు నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ఎన్నికల సంఘం పంచాయతీ ఎన్నికల తరహాలో ప్రణాళికాబద్ధంగా పకడ్బందీగా ఎన్నికలను నిర్వహించాలని వ్యూహాలు రచిస్తోంది.
ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో సింగిల్ నామినేషన్ లపై ఎస్ఈసి ఫోకస్ .. నివేదికలు పంపాలని కలెక్టర్లకు ఆదేశం
అధికార యంత్రాంగాన్ని సన్నద్ధం చేయడం కోసం ఎస్ఈసి సమావేశాలు
అందులో భాగంగానే అధికార యంత్రాంగాన్ని సన్నద్ధం చేయడం కోసమే ఈ సమావేశాలు నిర్వహించడానికి నిర్ణయం తీసుకున్నట్లుగా పేర్కొంది. ఈ నెల 27, 28 , మార్చి ఒకటి తేదీలలో ప్రాంతీయ సమావేశాలు నిర్వహించనున్నట్లు గా రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఇందులో భాగంగా ఈ నెల 27వ తేదీన తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీ సెనేట్ హాల్లో సమావేశం నిర్వహిస్తామని పేర్కొంది. ఆ తరువాత విజయవాడలోని కార్యాలయంలో రాష్ట్ర ఎన్నికల సంఘం సమావేశం నిర్వహిస్తుంది.
అధికారులతోనూ , గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నేతలతోనూ ఎస్ఈసి సమావేశం
ఈ సమావేశాలలో భాగంగా కలెక్టర్లు, ఎస్పీలు, మున్సిపల్ కమిషనర్లు, ఇతర అధికారులతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ మాట్లాడనున్నారు. అంతేకాదు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నేతలతో కూడా మున్సిపల్ ఎన్నికల నిర్వహణ పై చర్చించనున్నారు. రేపు 27 వ తేదీన ఐదు జిల్లాలో రాజకీయ పార్టీ నేతలతో సమావేశం కానున్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్, ఆ తర్వాత విజయవాడ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో కూడా అధికారులతో, రాజకీయ నేతలతో చర్చించనున్నారు. మార్చి 1 వ తేదీన విశాఖపట్నంలో మూడో రీజియన్ సమావేశం నిర్వహించనుంది .
గత ఎన్నికల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని తాజా నిర్ణయాలు
ఎన్నికల నిర్వహణ సజావుగా సాగడం కోసం రాష్ట్ర ఎన్నికల కమిషన్ నియమ , నిబంధనలు చెప్పడమే కాకుండా, రాజకీయ పార్టీల నేతల నుండి తగు సలహాలు సూచనలు కూడా తీసుకోనున్నారు.అధికార యంత్రాంగాన్ని ఎన్నికల నిర్వహణకు సమాయత్తం చెయ్యనున్నారు . గత ఎన్నికల్లో చోటు చేసుకున్న అవకతవకలను దృష్టిలో ఉంచుకుని మున్సిపల్ ఎన్నికల్లో ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా చూసుకోవటం కోసం తగిన నిర్ణయాలను తీసుకోనున్నారు. ఇప్పటికే సింగిల్ నామినేషన్ల విషయంలో దృష్టి సారించిన ఎస్ఈసి మున్సిపల్ ఎన్నికలను సక్సెస్ చెయ్యాలని భావిస్తోంది .