త్రిపురలో బీజేపీని గెలిపించిన నేతకు ఏపీలో కీలక బాధ్యతలు: ఎవరీ దియోధర్?
Recommended Video
అమరావతి: భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సోమవారం ఆంధ్రప్రదేశ్ పార్టీ ఇంచార్జులను నియమించింది. ఏపీతో పాటు మరో దక్షిణాది రాష్ట్రం కేరళకు కూడా ఇంచార్జ్ను నియమించింది. ఏపీ బీజేపీ ఇంచార్జ్గా వీ మురళీధరన్ను, కో ఇంచార్జ్గా సునీల్ దియోధర్కు కీలక బాధ్యతలు అప్పగించింది. కేరళ ఇంచార్జ్గా పీఎస్ శ్రీధరన్ పిళ్లైని నియమించింది.
ఏపీ కో ఇంచార్జ్గా నియమించబడిన సునీల్ ధియోధర్ త్రిపురలో బీజేపీ గెలుపులో కీలక పాత్ర పోషించారు. త్రిపురలో పార్టీని అధికారంలోకి తేవడంలో ఆయన పాత్ర ఎంతో ఉంది. అలాంటి నేతను ఇప్పుడు ఏపీ కో ఇంచార్జ్గా నియమించింది.
సునీల్ దియోదర్ 2014లో వారణాసిలో ప్రధాని నరేంద్ర మోడీకి మేనేజర్గా పని చేశారు. గత మూడేళ్లుగా త్రిపురలో మకాం వేసి, బీజేపీ గెలుపు కోసం పని చేశారు. గుజరాత్లో కూడా సునీల్ దియోదర్ పని చేశారు. అక్కడ అతని పని తీరు మెచ్చిన నరేంద్ర మోడీ 2014లో వారణాసిలో ఇంచార్జిగా నియమించారు. 2013లో మోడీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు దహోద్ జిల్లాలో కాంగ్రెస్కు ఐదు ఎమ్మెల్యే స్థానాలు, బీజేపీకి ఒకటి ఉంది. మోడీ.. దియోదర్ను అక్కడకు పంపించారు. ఐదు కాంగ్రెస్, ఒకటి బీజేపీకి ఉన్న దహోద్లో నాటి ఎన్నికల్లో బీజేపీకి మూడు సీట్లు రావడంలో దియోదర్ పాత్ర ఎంతో ఉంది.
2013లో దక్షిణ డిల్లీకి ఇంచార్జ్గా ఉన్న దియోదర్ పది సీట్లకు గాను ఏడు సీట్లు బీజేపీ గెలవడానికి కృషి చేశారు. మహారాష్ట్రలోను సీపీఎం స్థానంలో బీజేపీని గెలిపించారు. 2014లో మహారాష్ట్ర ఎన్నికల కోసం బీజేపీ ఆయనను రంగంలోకి దింపింది. ఆయనకు 32 నియోజకవర్గాల బాధ్యతను అప్పగించారు. శివసేన దానిని వ్యతిరేకించింది. దీంతో సునీల్ దియోదర్ను పాల్ఘర్కు పంపించారు. అక్కడ సీపీఎం హవా. నాటి మహారాష్ట్ర ఎన్నికల్లో పాల్ఘర్ స్థానంలో సీపీఎంను ధీటుగా ఎదుర్కొని బీజేపీ అభ్యర్థి గెలిచేలా వ్యూహాలు రచించారు.