అంత తెలివి తక్కువవాడిని కాదు: వెంకన్న చౌదరి వ్యాఖ్యలపై వివరణ ఇచ్చిన మురళీ మోహన్
అమరావతి: మినీ మహానాడులో కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని వెంకన్న చౌదరి అని మాట్లాడటంపై తెలుగుదేశం పార్టీ లోకసభ సభ్యులు మురళీ మోహన్ వివరణ ఇచ్చారు.
రాజమహేంద్రవరంలో జరిగిన మినీ మహానాడులో తాను పొరపాటుగా అలా మాట్లాడానని చెప్పారు. వేంకటేశ్వరస్వామికి కూడా కులాన్ని ఆపాదిస్తూ ఆయన వ్యాఖ్యానించారని, అందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి. విమర్శలు రావడంతో దీనిపై ఆయన స్పందించారు.
తాను అప్పటి వరకు మంత్రి బుచ్చయ్య చౌదరి పక్కన కూర్చుని ఆయనతో మాట్లాడడంతో తన నోటి వెంట వెంకన్న చౌదరి అని వచ్చిందన్నారు. తాను దేవుడికి కులాన్ని అంటగట్టేంత తెలివితక్కువ వాడిని కాదన్నారు.
కర్ణాటకలో బిజెపికి మెజార్టీ రాలేదంటే...కారణం మా తిరుమల వెంకన్న చౌదరి:మురళీ మోహన్
తనకు అసలు కులాలు అనే దానిపై కూడా నమ్మకం లేదన్నారు. అటువంటిది ఉద్దేశ పూర్వకంగా శ్రీవారిని ఎలా అంటానని ప్రశ్నించారు. ఈ మాట తన నోటి నుంచి పొరపాటుగా వచ్చిందని, తాను ఈరోజు దేవుడికి దండం పెట్టుకునేటప్పుడు కూడా దేవుడి ఫొటోకి చెప్పుకున్నానని చెప్పారు.
కాగా, కర్ణాటక ఎన్నికల్లో రకరకాల మతలబులు చేసినప్పటికీ బీజేపీకి మెజార్టీ రాకపోవడానికి కారణం మా తిరుమల తిరుపతి వెంకన్న చౌదరి అంటూ ఎంపీ మురళీ మోహన్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. సందర్భాన్ని బట్టి చూస్తే అవి తిరుమల వెంకటేశ్వరుని ఉద్దేశించి అన్నట్లుగా ఉన్నాయి. దీనిపై విమర్శలు వచ్చాయి.