టీటీడీ చైర్మన్గా మురళీమోహన్కు ఛాన్స్, టీ నేతలకూ..
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ ఎంపీ, ప్రముఖ సినీ నటుడు మురళీ మోహన్ను తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గిరి వరించే అవకాశముందని వార్తలు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు మురళీ మోహన్కు టీటీడీ చైర్మన్ బాధ్యతలు అప్పగించవచ్చునని అంటున్నారు.
ఇందుకు సంబంధించి వచ్చే వారం లేదా మరికొద్ది రోజుల్లో ఆదేశాలు జారీ చేయవచ్చునని అంటున్నారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ కేబినెట్ భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ భేటీలో ఆలయ కమిటీలు అన్నింటిని రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. టీటీడీ కమిటీని కూడా రద్దు చేయాలని నిర్ణయించుకున్నారు.
ఈ నేపథ్యంలో టీటీడీ చైర్మన్ పదవి కోసం పలువురు రేసులో ఉన్నారు. అయితే, చంద్రబాబు విజయవాడ నుండి గెలుపొందిన మురళీ మోహన్ వైపు మొగ్గు చూపుతున్నారని అంటున్నారు. ఏపీ చీఫ్ సెక్రటరీ ఐవైఆర్ కృష్ణారావు కమిటీలు రద్దు చేసే ఫైళ్ల పైన సంతకాలు చేశారని, ఇందుకు సంబంధించిన ఆర్డినెన్స్ త్వరలో విడుదల కానుందని అంటున్నారు.
ప్రస్తుతం టీటీడీ చైర్మన్గా ఉన్న కనుమూరి బాపిరాజు తప్పుకోవాలని దేవాదాయ శాఖ మంత్రి పలుమార్లు చెప్పిన విషయం తెలిసిందే. మరోవైపు టీటీడీలో ఆరుగురు తెలంగాణ టీడీపీ నేతలకు అవకాశం దక్కవచ్చునని అంటున్నారు. ఏపీలోని కమిటీలలో తమకు అవకాశం ఇవ్వాలని టీ-టీడీపీ నేతలు చంద్రబాబును కోరిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా టీటీడీలో ఆరుగురు తెలంగాణ వారికి అవకాశం ఇవ్వవచ్చునని అంటున్నారు.