'గడ్కరీకి బాబు నిజాయితీ కనిపించింది! పవన్కు బీజేపీ ప్రత్యేక ప్యాకేజీ'
Recommended Video
అమరావతి: పోలవరం ప్రాజెక్టు వాస్తవాలను కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కళ్లారా చూశారని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు గురువారం అన్నారు. పేపర్లపై చూడటం వేరు, ప్రత్యక్షంగా చూడటం వేరని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వం నిజాయితీ గడ్కరీకి కనిపించిందని చెప్పారు. ఇతర కేంద్రమంత్రులు కూడా పోలవరాన్ని సందర్శించాలన్నారు.
ఇక చాలు, మొదటికే మోసం: పవన్పై ఆదేశాలు! జనసేనానిపై గంటా డౌట్
పోలవరం వివరాలను గడ్కరీ కేంద్రానికి తగిన విధంగా వివరించాలని మురళీ మోహన్ అన్నారు. నిధుల కొరత లేకుండా త్వరగా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేలా చూడాలన్నారు. గడ్కరీ కితబుతో ప్రతిపక్ష నేతలు నోరు మూసుకోవాలి అని ఎంపీ కేశినేని నాని అన్నారు. కాగా, ఏపీకి అన్యాయాన్ని నిరసిస్తూ అనంతపురంలో బుధవారం టీడీపీ ధర్మపోరాట దీక్షను నిర్వహించింది. ఈ సందర్భంగా ఎంపీలు మాట్లాడారు.
జగన్, పవన్ కళ్యాణ్ తోలుబొమ్మలుగా
పోరాటాలతో కేంద్ర ప్రభుత్వం మెడలు వంచే శక్తి తెలుగు ప్రజలకు ఉందని టీడీపీ ఎంపీలు అన్నారు. గతంలో ఎన్టీఆర్ను పదవీచ్యుతుడిని చేసినప్పుడు కూడా పోరాటం ద్వారానే మళ్లీ ఆయన్ను ముఖ్యమంత్రిని చేశారన్నారు. ప్రధాని మోడీ ఆడిస్తున్న నాటకంలో జగన్, పవన్ కళ్యాణ్ తోలుబొమ్మలుగా మారారని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఏజెంట్లుగా పవన్, జగన్ను ఏర్పాటు చేసుకున్నారని ఆరోపించారు.
పవన్కు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ
కేసుల భయంతో జగన్, ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ కోసం పవన్ కళ్యాణ్ బీజేపీ ద్రోహులతో జతకట్టారని టీడీపీ ఎంపీలు ఆరోపించారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై తిరగబడిన దమ్ము, రాష్ట్రాన్ని నిలువునా చీల్చిన కాంగ్రెస్ పార్టీని 2014లో కనిపించకుండా చేసిన ఘనత చంద్రబాబుదే అన్నారు. మోసం చేసిన బీజేపీకి కూడా వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు.
దమ్ముంటే 17వ తేదీన నిలదీయండి
జగన్, పవన్ కళ్యాణ్లకు దమ్ముంటే ఈ నెల 17న ఢిల్లీలో జరిగే అన్ని పార్టీల సమావేశానికి హాజరై ప్రధాని మోడీని నిలదీయాలని ఎంపీలు సవాల్ విసిరారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కమలం పార్టీకి అద్దె మైకు, వైసీపీకి సొంత మైకులా మారారని విమర్శించారు.
మోడీ మాట ఇచ్చి తప్పారు
ఢిల్లీని తలదన్నేరీతిలో అమరావతి రాజధాని నిర్మాణానికి నిధులు ఇస్తామన్న ప్రధాని మోడీ ఆ తర్వాత మాట తప్పారని టీడీపీ ఎంపీలు విమర్శించారు. రాష్ట్రానికి అన్యాయం చేసిన బీజేపీ, ఆ పార్టీతో అంటకాగుతున్న వైసీపీ, జనసేనలకు ప్రజలు గుణపాఠం చెప్పాలన్నారు. వెనుకబడిన ప్రాంతాలకు మంజూరు చేసిన రూ.350 కోట్ల నిధులను తిరిగి వెనక్కి తీసుకున్నది దేశ చరిత్రలో ఒక్క మోడీ ప్రభుత్వానిదేనని మండిపడ్డారు. మోడీ, అమిత్ షా తుచ్ఛరాజకీయాలు చేస్తున్నారన్నారు.