జగన్! 24 గంటలు టైమిస్తున్నా లేదంటే: మురళీ మోహన్ కోడలు హెచ్చరిక
Recommended Video
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి తనపై చేసిన ఆరోపణలను 24 గంటల్లోగా నిరూపించాలని రాజమండ్రి టీడీపీ ఎంపీ మురళీ మోహన్ కోడలు రూప డిమాండ్ చేశారు. ఆమె ఆదివారం హైదరాబాదులో మాట్లాడారు.
రెండు తెలుగు రాష్ట్రాలలో ఎక్కడైనా తనకు ప్రభుత్వ భూమి ఉన్నట్లుగా నిరూపిస్తే తనపై ఏ కేసుకైనా సిద్ధమని చెప్పారు. ఇతరులపై ఆరోపణలు చేసే ముందు ఆలోచించుకోవాలని హితవు పలికారు. ఆధారాలు ఉంటేనే జగన్ ఆరోపణలు చేయాలని చెప్పారు.
రాజమండ్రి బలభద్రపురంలో తనకు ప్రభుత్వం స్థలం ఇస్తానన్నప్పటికీ వద్దని చెప్పానని ఆమె అన్నారు. బాధ్యతగల ప్రతిపక్ష హోదాలో ఉన్న జగన్ ఒకరిపై ఆరోపణలు చేసినప్పుడు నిరూపించాలన్నారు. తనపై చేసిన ఆరోపణలకు గాను ఒకరోజు సమయం ఇస్తున్నానని చెప్పారు.
అంతకుముందు, మురళీ మోహన్ మాట్లాడుతూ... జగన్పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 18 నెలల పాటు జైల్లో గడిపిన జగన్కు తన గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. అసత్య ఆరోపణలు చేసి నిరూపించలేకపోయారన్నారు. అలీఫ్ అనే సంస్థ సేవా కార్యక్రమాలు చేస్తోందని, ప్రభుత్వం దానికి భూమి కేటాయిస్తే తనకేం సంబంధమన్నారు.
జగన్ తన పాదయాత్రలో తనపై అనుచిత ఆరోపణలు చేస్తున్నారన్నారు. జగన్ తీరు మార్చుకోకుంటే పరువునష్టం దావా వేస్తానని హెచ్చరించారు. ఇసుక దందాలకు తనకు సంబంధం ఏమిటన్నారు. సంపాదన కోసం రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం తనకు లేదన్నారు. అలీఫ్ సంస్థతో తమ కుటుంబానికి సంబంధమే లేదన్నారు. నేను తప్పు చేసినట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధమన్నారు.