రాజకీయాల్లో ఇక మురళీమోహన్ కోడలు యాక్టివ్
రాజమండ్రి: తెలుగుదేశం పార్టీ రాజమండ్రి పార్లమెంటు సభ్యుడు మాగంటి మురళీమోహన్ కోడలు మాగంటి రూప సోమవారం ఎఎంసి ఛైర్మన్ ముళ్లపూడి ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొని రాజకీయ రంగప్రవేశం చేశారు. మురళీమోహన్ రాజకీయ వారసురాలిగా ఆమె ఇక నుండి ప్రజా సమస్యలపై రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గంలో పర్యటిస్తారు.
తమ మామ రాజమండ్రి ఎంపి మురళీమోహన్కు రాజకీయంగా తాను సహకరిస్తానని ఆమె చెప్పారు. లోక్సభ సమావేశాలు జరుగుతున్నప్పుడు ఎక్కువ సమయం ఆయన ఢిల్లీలో ఉంటారని, ఆ సమయంలో పార్లమెంటరీ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలలో తాను పర్యటించి ప్రజల సమస్యలపై దృష్టి పెడుతానని ఆమె చెప్పారు.
తన మామ మురళీమోహన్ దత్తత తీసుకున్న గ్రామాలలో విస్తృతంగా పర్యటిస్తున్నట్టు రూప తెలిపారు. తాను కూడా రాజకీయ కుటుంబం నుండే వచ్చానని, తన తాత గుడివాడ ఎమ్మెల్యేగా పనిచేసినట్టు చెప్పారు. శ్రీలంకలో తాను అనేక సామాజిక కార్యక్రమాలలో పాల్గొన్నానని, అదే స్ఫూర్తితో ఇక్కడ సేవలందిస్తానన్నారు.
పదవులు బాధ్యతలను మరింత పెంచుతాయని, ప్రజలతో మమేకమై పనిచేసేవారే నిజమైన నాయకులని రాజమండ్రి ఎంపి మాగంటి మురళీమోహన్ చెప్పారు. దేవరపల్లిలో సోమవారం సాయంత్రం గోపాలపురం ఎఎంసి ఛైర్మన్గా ముళ్లపూడి వెంకట్రావు, వైస్ ఛైర్మన్ ఎం అనిత, డైరెక్టర్ల ప్రమాణ స్వీకారోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా ప్రజాప్రతినిధులు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజాసేవలో మరింత చురుకుగా పాల్గొనాలన్నారు. ప్రజల అండదండలతోనే ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యామనే విషయాన్ని మరచిపోకూడదని అన్నారు.
ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు ఎక్కువ సమయం కేటాయించాలన్నారు. గోపాలపురం ఎఎంసి ఛైర్మన్గా ఎన్నికైన ముళ్లపూడి వెంకట్రావు తదితర పాలకవర్గాన్ని ఆయన ఈ సందర్భంగా అభినందించారు. జడ్పీ ఛైర్మన్ ముళ్లపూడి బాపిరాజు మాట్లాడుతూ - రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో తీసుకున్న చర్యల వల్ల అనేక మంచి ఫలితాలు వస్తున్నాయన్నారు.
ఇటీవల కాలంలో రైతుల ఆత్మహత్యలు జరగడం బాధాకరమని, వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా చేసేందుకు సిఎం చంద్రబాబు అనేక విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటున్నారన్నారు. క్షణికావేశంలో రైతులు ఆత్మహత్యలకు పాల్పడవద్దన్నారు. వ్యవసాయోత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ఎఎంసిలు దోహదపడతాయన్నారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.