పవన్ వస్తే కారు వరకు, తీరు మార్చుకోమని చంద్రబాబుకు చెప్పాల్సింది: మురళీమోహన్
అమరావతి: ప్రత్యేక హోదా విషయంలో టీడీపీని తప్పుబడుతున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై తెలుగుదేశం పార్టీ నేత, ఎంపీ మురళీ మోహన్ స్పందించారు. అతనిని ప్రేమించే వ్యక్తిగా చెబుతున్నానని, పవన్ ఒక్కసారి ఆలోచించాలని హితవు పలికారు.
చవదండి: పట్టించుకోవట్లేదు, అందుకే నేను ఇలా: పవన్ కళ్యాణ్పై జేపీ విమర్శలు
Recommended Video
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం చేస్తున్న అన్యాయంపై మురళీ మోహన్ ఓ టీవీ ఛానల్తో మాట్లాడారు. ఏపీకి ప్రత్యేక హోదా కావాలంటూ కొద్ది రోజుల నుంచి టీడీపీ ఎంపీలు అందరూ ఢిల్లీలో పోరాడుతున్న విషయం తెలిసిందే. దీనిపై ఆయన మాట్లాడారు.
చంద్రబాబును పొగిడి ఎందుకు యూటర్న్ తీసుకున్నారో
కొద్ది రోజులకు ముందు ముఖ్యమంత్రి చంద్రబాబును పొగిడిన పవన్ కళ్యాణ్ హఠాత్తుగా యూటర్న్ ఎందుకు తీసుకున్నారో అర్థం కావడం లేదని మురళీ మోహన్ అన్నారు. ఒకవేళ చంద్రబాబు తప్పు చేస్తుంటే ఆయనతోనే నేరుగా చెప్పేంత చనువు పవన్కు ఉందన్నారు. టీడీపీలో ఉన్న కీలక నేతలకంటే ఎక్కువ ప్రాధాన్యతను పవన్కు చంద్రబాబు ఇచ్చారన్నారు.
పవన్కు చంద్రబాబు ఎంత ప్రాధాన్యత ఇచ్చారంటే
పవన్ వస్తుంటే చంద్రబాబు ఎదురెళ్లి తీసుకువచ్చి, తిరిగి వెళ్లేటప్పుడు కారు వరకు వెళ్లేవారని మురళీ మోహన్ చెప్పారు. కీలక నేతలకు కూడా చంద్రబాబు అయిదు నిమిషాల కంటే ఎక్కువ సమయం ఇవ్వరని, పవన్కు మాత్రం ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చారన్నారు. ఇంత అనుబంధం ఉన్నప్పుడు, ఏదైనా తప్పుగా కనిపిస్తే.. మీరు తప్పు చేస్తున్నారు, కాస్త మార్చుకోండి అని చెప్పి ఉండవచ్చు అన్నారు.
పవన్ కళ్యాణ్ వెనుక ఎవరో
నిజంగా ఏపీని అభివృద్ధి చేయాలనే బలమైన ఆకాంక్ష ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ అలా చేయాల్సి ఉండెనని, కానీ మీడియా ముందుకు వచ్చి మాట్లాడటం సరికాదని మురళీ మోహన్ అన్నారు. తీరు చూస్తుంటే పవన్ వెనుక ఎవరో ఉండి నడిపిస్తున్నట్లుగా ఉందన్నారు. పవన్ను ప్రేమించే వ్యక్తిగా ఓ విషయం చెబుతున్నానని, తనకు సంబంధించిన విషయాలపై పవన్ మరోసారి ఆలోచించుకోవాలన్నారు.
మోడీ ప్రభుత్వంపై విమర్శలు
ఎదిగినకొద్దీ ఒదిగి ఉండాలని అంటారని, పెద్ద నోట్ల రద్దు సమయంలో మధ్యతరగతి ఆనందించిందని, కష్టాలు ఓర్చుకుందని, బాధపడినా సరే నల్లధనం పోతుందని ఓర్చుకుందని, కానీ కొందరి వద్ద నల్లధనం కనిపించేసరికి నమ్మకం పోయిందని, జీఎస్టీ విధానం మంచిదేనని, కానీ పన్ను విధింపులో తొందరపాడు నిర్ణయాలు కనిపించాయని మోడీ ప్రభుత్వంపై మురళీ మోహన్ విమర్శలు గుప్పించారు.