ట్యాంక్బండ్ విగ్రహాలు రాజమండ్రికి: మురళీ మోహన్
రాజమండ్రి: విభజన అనంతరం తెలుగు కవులు, కళాకారుల విగ్రహాలను హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై నుండి తొలగించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తోందని, ఈ నేపథ్యంలో వాటిని రాజమండ్రికి తీసుకు వచ్చి గోదావరి బండ్ పైన ఏర్పాటు చేస్తామని రాజమండ్రి ఎంపీ, తెలుగుదేశం పార్టీ నేత మురళీ మోహన్ అన్నారు.
ట్యాంక్ బండ్ పైన ఉన్న విగ్రహాల తరహాలోనే గోదావరి బండ్ పైన విగ్రహాలు నెలకొల్పుతామని చెప్పారు. గతంలో ఉమ్మడి ఏపీలో నంది నాటకోత్సవాలు జరిగాయని, రెండేళ్లుగా అవి వాయిదా పడుతున్నాయని, ఈసారి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చొరవతో కొత్త రాష్ట్రంలో రాజమండ్రిలో నిర్వహిస్తామన్నారు.
రఘువీరా రెడ్డికి టీడీపీ నేతల ఫోన్
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రఘువీరా రెడ్డికి తెలుగుదేశం పార్టీ నేతలు ఫోన్ చేసినట్లుగా తెలుస్తోంది. తిరుపతి ఉప ఎన్నికలు సమీపిస్తుండడంతో కాంగ్రెస్ పార్టీ తరపున అభ్యర్థిని నిలబెట్టకూడదని టీడీపీ నేతలు, రఘువీరాకు విన్నవించినట్లు సమాచారం.
దీనిపై సానుకూలంగా స్పందించిన రఘువీరా రెడ్డి గురువారం సాయంత్రం తమ నిర్ణయం చెబుతామని టీడీపీ నేతలకు చెప్పినట్లు తెలుస్తోంది. తిరుపతి ఉప ఎన్నికల్లో పోటీకి తాము దూరంగా ఉన్నట్లు ఇంతకుముందే వైయస్సార్ కాంగ్రెస్ ప్రకటించిన విషయం తెలిసిందే.