బాబుకు మరో తలనొప్పి: రాయపాటి కొత్త ట్విస్ట్, మురళీ మోహన్ ఒత్తిడి?
కేబినెట్ విస్తరణ తర్వాత తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు మరో తలనొప్పి వచ్చి పడింది.
అమరావతి: కేబినెట్ విస్తరణ తర్వాత తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు మరో తలనొప్పి వచ్చి పడింది. తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) చైర్మన్ పదవి టిడిపిలో చిచ్చు రాజేసింది. ఆ పదవిపై చాలామంది కన్నేశారు.
రేసులో రాజమహేంద్రవరం ఎంపీ మురళీ మోహన్, నరసారావుపేట ఎంపీ రాయపాటిసాంబశివ రావు తదితరులు ఉన్నారు. ఇప్పటికే ఆ పదవి మురళీ మోహన్కు దాదాపు ఖాయమైందనే ప్రచారం సాగుతోంది.
తెరవెనుక మురళీ మోహన్ ప్రయత్నాలు
మురళీ మోహన్ ఆ పదవి కోసం తెరవెనుక ప్రయత్నాలు ముమ్మరం చేశారని అంటున్నారు. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా ముద్రపడ్డారు. దీంతో అధినేతపై ఆయన ఎక్కువ ఒత్తిడి చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
దేనికైనా రెడీ
అదే సమయంలో, రాయపాటి కూడా ఈ పదవిపై మక్కువ పెంచుకున్నారు. అయితే, ఆయనకు ఈసారి కూడా ఆ పదవి దక్కే అవకాశాలు కనిపించడం లేదు. టిటిడి చైర్మన్ పదవి కోసం అవసరమైతే ఎంపీ పదవికి కూడా రాజీనామా చేసేందుకు ఆయన సిద్ధంగా ఉన్నారు.
గతంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో కనుమూరి బాపిరాజుకు టిటిడి చైర్మన్ పదవి దక్కింది. అప్పుడే రాయపాటి ఆ పదవి కోసం ప్రయత్నించి విఫలమయ్యారు. ఆ తర్వాత పరిణామాల నేపథ్యంలో ఆయన టిడిపిలో చేరారు.
రాయపాటి ప్రయత్నాలు
టిడిపిలో చేరినప్పటికీ.. తొలిసారి రాయపాటికి ఆ పదవి దక్కలేదు. చిత్తూరు జిల్లాకు చెందిన చదలవాడ కృష్ణమూర్తిని వరించింది. దీంతో ఇప్పుడు మరోసారి రాయపాటి తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం ఆయన పది రోజుల క్రితమే చంద్రబాబుకు లేఖ రాశారు. ఏకంగా ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని కూడా కొత్త ఆఫర్తో ముందుకు వచ్చారు.
ఈసారి కూడా ఆశ నెరవేరదా?
మరోవైపు చంద్రబాబుకు సన్నిహితుడైన మురళీ మోహన్ రేసులో ఉండటంతో రాయపాటి ఆశలు ఈసారి కూడా నెరవేరకపోచ్చునని అంటున్నారు. చదలవాడు రాయలసీమ వాడు కావడంతో.. ఈసారి కోస్తాంధ్ర వారికి ఇవ్వాలని అంటున్నారు.