పవన్ కళ్యాణ్ మంచి వ్యక్తి కానీ, కేసీఆర్-బాబు కలిస్తే: మురళీ మోహన్ ఆసక్తికరం
ఏలూరు: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, కేసీఆర్లు కలిస్తే దేశ రాజకీయాలను శాసించే పరిస్థితి వస్తుందని రాజమండ్రి పార్లమెంటు సభ్యులు మురళీ మోహన్ సోమవారం అన్నారు. తెలంగాణలో టీడీపీ, టీఆర్ఎస్ పొత్తు పెట్టుకోవాలనేది తన వ్యక్తిగత అభిప్రాయం అని చెప్పారు.
Recommended Video
జగన్కు భారీగా డొనేషన్ ఇచ్చా! ఎవరి మాటా వినను: కన్నబాబు సంచలనం
టీడీపీ - టీఆర్ఎస్ కలిస్తే
అలా కలిస్తే రెండు రాష్ట్రాల్లోని 42 పార్లమెంటు స్థానాల్లో మెజారిటీ సీట్లను గెలుచుకోవచ్చునని మురళీ మోహన్ చెప్పారు. అప్పుడు కేంద్ర ప్రభుత్వంలో కీలకపాత్ర పోషించవచ్చునని అభిప్రాయపడ్డారు. కేసీఆర్ మాత్రం బీజేపీకి దగ్గర కావాలని చూస్తున్నట్లుగా కనిపిస్తోందన్నారు. ఏపీలో సీఎం చంద్రబాబుకు సానుకూల వాతావరణం ఉందని చెప్పారు.
పవన్ కళ్యాణ్ మంచి వ్యక్తి
వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపు ఖాయమని చెప్పారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి అక్రమార్జనలో తప్ప పాలనలో ఏమాత్రం అనుభవం లేదని చెప్పారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంచి వ్యక్తేనని, కానీ ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని పాలించే అనుభవం లేదని చెప్పారు. రాష్ట్రంలో టీడీపీ ఒంటరిగా పోటీ చేస్తుందని చెప్పారు. తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు వెళ్లే యోచనలో కేసీఆర్ ఉన్నారని అభిప్రాయపడ్డారు.
రూ.2వేల నోట్లను రద్దు చేయాలి
నోట్ల రద్దు తర్వాత కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన రూ.2 వేల నోటును రద్దు చేయాలని మంత్రి నారా లోకేశ్ డిమాండ్ చేశారు. దేశంలో రూ.500కు మించి పెద్ద నోటు ఉండకూడదనేది తమ విధానం అని చెప్పారు. రూ.2 వేల నోటు వల్ల దేశంలో అవినీతి మరింత పెచ్చరిల్లే అవకాశముందని చెప్పారు.
2012 నుంచి చంద్రబాబు పోరాటం
పెద్ద నోట్లు రద్దు చేయాలంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2012 నుంచి పోరాడుతున్నారని లోకేష్ తెలిపారు. రూ.1000, రూ.500 నోట్ల రద్దు చేయాలని గతంలోను డిమాండ్ చేశారన్నారు. రూ.2వేలనోట్లను కూడా రద్దు చేయాలని ఆయన అన్నారు.