చిరంజీవిలా పవన్ కళ్యాణ్ కాదు, మోడీని అంచనా వేయగల నేత, బాబు బలమైన నేత: మురళీధర రావు
అమరావతి: బీజేపీ జనరల్ సెక్రటరీ మురళీధర రావు ఏపీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు, ఆంధ్రప్రదేశ్లో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తమకు ఓ ప్లాన్ కూడా చెప్పారు. ఏపీలో టీడీపీ ఇప్పటికే ఎన్నికల వ్యూహాన్ని అమలు చేసే పనిలో పడిందని, బీజేపీ ఇంకా పూర్తి స్థాయిలో రాష్ట్ర రాజకీయ రంగంలోకి దిగలేదన్నారు.
ఏ పరిణామాన్ని కూడా తేలికగా వదిలిపెట్టకుండా తుది దాకా పోరాడే శక్తి సీఎం చంద్రబాబుకు ఉందన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ అధ్యక్షులు అమిత్ షాలను అంచనా వేయగలిగే అతికొద్దిమంది నేతల్లో చంద్రబాబు ఒకరన్నారు. చంద్రబాబులాంటి బలమైన నేతను ఓడించేందుకు కొత్త పార్టీలు, వేదికలు ముందుకు వస్తాయన్నారు.
చిరంజీవి విఫలమైనట్లు పవన్ అవుతారనే అంచనాలు తప్పు
వివిధ రకాల సమీకరణాలు టీడీపీకి వ్యతిరేకంగా పని చేస్తాయని తాను భావిస్తున్నట్టు మురళీధరరావు ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన తర్వాత చిరంజీవి విఫలమయినట్టు, ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా విఫలమవుతారనే అంచనాలు తప్పని, అప్పటికీ ఇప్పటికీ రాజకీయ పరిస్థితులు మారిపోయాయని చెప్పారు. వివిధ వర్గాలను తనకు మద్దతుగా రప్పించుకోగల సమర్థతను పవన్ ప్రదర్శించాల్సి ఉందన్నారు.
ఎన్డీయే నుంచి పార్టీలు వెళ్లిపోయే పరిస్థితి ఉండదు
ఎన్టీయేలో ఉన్న పార్టీలు బయటకు వెళ్లిపోయే పరిస్థితి ఉండదని, కొత్త పార్టీలు కూడా వచ్చి చేరుతాయని మురళీధర రావు చెప్పారు. శివసేనతో తమకు విభేదాలు లేవని తెలిపారు. బీజేపీని బలోపేతం చేయడంతో పాటు, మిత్రులను కలుపుకొని ముందుకు వెళతామన్నారు. ఏపీలో చంద్రబాబును గద్దె దించుతామన్నారు. అయితే చంద్రబాబును ఓడించడం అంత సులువు కాదన్నారు.
ఏడాది ముందు చంద్రబాబు వెళ్లిపోవడం ప్లాన్
ఎన్డీయే నుంచి తెలుగుదేశం వెళ్లిపోవడం చంద్రబాబు మాస్టర్ ప్లాన్ అని మురళీధర రావు అన్నారు. అతను ఏడాది ముందే బయటకు వెళ్లి ఎన్నికల వ్యూహాలు ప్రారంభించారని అభిప్రాయపడ్డారు. 2019కి మా వ్యూహాలు మేం సిద్ధం చేస్తున్నామని అభిప్రాయపడ్డారు. ఎన్నికలకు ముందు ఎన్డీయేలోకి మరిన్ని పార్టీలు వస్తాయని, అయితే టిక్కెట్ల విషయంలో కొంత ఇబ్బంది అవుతుందని అభిప్రాయపడ్డారు.
చంద్రబాబును మళ్లీ సీఎం కాకుండా చేస్తాం
చంద్రబాబును ఓడించడానికి ముందు చాలా శక్తులను ముందుకు వస్తాయని, బాబును మళ్లీ ముఖ్యమంత్రి కాకుండా చేయడమే లక్ష్యమని మురళీధర రావు అన్నారు. త్వరలో రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు వస్తాయన్నారు. ఏపీ ప్రజలను రెచ్చగొట్టి రాజకీయంగా పై చేయి సాధించాలన్న చంద్రబాబు వ్యూహం నెరవేరుతుందని భావించడం లేదన్నారు.