రాహుల్ గాంధీతో చంద్రబాబు కలవడం అవమానమే: మురళీధర రావు, టీఆర్ఎస్పై ఆగ్రహం
హైదరాబాద్/అమరావతి: కాంగ్రెస్ పార్టీకి టీడీపీ, టీఆర్ఎస్ పార్టీలు జేబు సంస్థలుగా పని చేస్తున్నాయని బీజేపీ నేత మురళీధర రావు ఆదివారం మండిపడ్డారు. దేశంలోనే టీఆర్ఎస్ అవినీతికర ప్రభుత్వమన్నారు. నిరుద్యోగానికి మారుపేరు టీఆర్ఎస్ అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతిపై బీజేపి త్వరలో చార్జిషీట్ వేస్తుందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను గ్రామగ్రామానికి తీసుకు వెళ్తామని, కేంద్రం కేటాయించిన నిధులను టీఆర్ఎస్ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందన్నారు.
దేశభద్రత, సంస్కృతిని వ్యతిరేకించే స్థాయికి కాంగ్రెస్ దిగజారిందన్నారు. జమ్ము కాశ్మీర్లో సైఫుద్దీన్ సోజ్, ఆజాద్ వేర్పాటువాదల భాష మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వారి భాష సైనికుల మనోధైర్యాన్ని దెబ్బతీసేలా ఉందన్నారు. రాజకీయాల కోసం వేర్పాటువాదులతో అంటకాగడం సరికాదన్నారు. దేశ భద్రత, సమగ్రతకు బీజేపీ పాటుపడుతోందన్నారు. దక్షిణ భారత దేశంలో పూర్తి ప్రణాళికతో ముందుకు వెళ్తామని, 2019 ఎన్నికలకు బీజేపీ సిద్ధంగా ఉందన్నారు.
బీజేపీ దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలకు సంస్థాగతంగా సిద్ధమైందన్నారు. కర్నాటక ఫలితాలతో కాంగ్రెస్ ఓటమి వైపు దూసుకెళ్తుందన్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో కాంగ్రెస్కు బలమైన స్థానం లేదని చెప్పారు. కర్నాటక ప్రభావం తెలంగాణలో కూడా ఉంటుందన్నారు.
ఏపీ సీఎం చంద్రబాబుపై కూడా మురళీధర రావు మండిపడ్డారు. ఏపీ అవసరాలను చంద్రబాబు జీరో చేశారన్నారు. కాంగ్రెస్కు వ్యతిరేకంగా దివంగత ఎన్టీఆర్ టీడీపీ స్థాపించారని గుర్తు చేశారు. ఆ పార్టీలో ఉంటూ ఎన్టీఆర్ను అవమానించేలా చంద్రబాబు.. రాహుల్ గాంధీని కలిశారన్నారు. కాంగ్రెస్తో చంద్రబాబు చేతులు కలపడం ఏపీ ప్రజలకు అవమానం అన్నారు.