పార్టీ చీఫ్గా తొలిసారి, బాబును టార్గెట్ చేసిన కన్నా: 'పార్టీలో కొత్త లేదు, పాతలేదు'
Recommended Video
అమరావతి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై ఏపీ బీజేపీ కొత్త అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ తొలిసారి విరుచుకుపడ్డారు. ఢిల్లీలో సోమవారం అన్ని రాష్ట్రాల బీజేపీ అధ్యక్షుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి హాజరైన కన్నా మీడియాతో మాట్లాడారు. ఏపీ సీఎంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
కన్నాకు పదవా?: బీజేపీలో రాజీనామా కలకలం, సోము వీర్రాజు ఆగ్రహం, ట్విస్ట్.. నాడే అమిత్ షా హామీ
ప్రత్యేక హోదా బదులు కేంద్రం మంచి ప్యాకేజీ ఇచ్చినప్పటికీ చంద్రబాబు సాధించుకోలేకపోయారని విమర్శించారు. ఆయన ఎలాంటి అవినీతికి పాల్పడకపోతే భయపడటం ఎందుకని ప్రశ్నించారు. 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఏపీ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని చెప్పారు.
పవన్ కళ్యాణ్, జగన్తో దోస్తీపై కన్నా స్పందన
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్, పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేనతో బీజేపీ జతకడుతుందని జరుగుతున్న ప్రచారంపై కన్నా స్పందించారు. అదంతా వట్టి ప్రచారమే అన్నారు. వచ్చే ఎన్నికల్లో పొత్తులపై పార్టీ అధిష్ఠానానిదే తుది నిర్ణయమన్నారు. బీజేపీ విజయం కోసం కృషి చేస్తామని, అందరినీ కలుపుకునిపోతానని చెప్పారు.
85 శాతం హామీలు అమలు చేశాం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలోని హామీల్లో 85 శాతం పూర్తి చేశామని కన్నా చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీపై ఏపీలో దుష్ప్రచారం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. నిజాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని తెలిపారు. దుష్ప్రచారం చేయడం ద్వారా 2019 ఎన్నికల్లో రాజకీయంగా లబ్ధి పొందడానికే బీజేపీపై రాష్ట్ర ప్రభుత్వం, ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అడిగినవి కేంద్రం కాదనలేదు
నూటికి నూరు శాతం విభజన చట్టంలోని హామీలను కేంద్రం నెరవేరుస్తుందని కన్నా చెప్పారు. పొత్తులో ఉండి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. అంతే కానీ కేంద్రం ఏనాడూ రాష్ట్ర ప్రభుత్వం అడిగినవి కాదనే పరిస్థితి మాత్రం లేదని తేల్చి చెప్పారు.
బీజేపీలో గ్రూపులు లేవు
ఏపీ బీజేపీలో ఎలాంటి గ్రూపులు లేవని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర రావు అన్నారు. రెండు గ్రూపులు లేవని, పార్టీలో కొత్తవారు, పాతవారు అని ఉండరని చెప్పారు. కర్నాటక ఎన్నికల అంశంపై కూడా ఆయన మాట్లాడారు.కర్నాటక ఎన్నికల విషయంలో బీజేపీపై తప్పుడు ప్రచారం జరిగిందని, అయినప్పటికీ తమ గెలుపు ఖాయమన్నారు. కర్నాటకలో ఓటమి తప్పదని భావించి కాంగ్రెస్ తెరపైకి దళిత సీఎం అంశాన్ని తెస్తోందన్నారు.