టిడిపి ఎమ్మెల్యేపై హత్యాయత్నం: తప్పిన ప్రమాదం
కర్నూలు: జిల్లాలోని బనగానపల్లి తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు బిసి జనార్ధన్ రెడ్డిపై శుక్రవారం హత్యాయత్నం జరిగింది. ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న కారును మరో వాహనంతో ఢీకొట్టేందుకు కొందరు దుండగులు ప్రయత్నించారు. ఎమ్మెల్యే గన్మెన్ అప్రమత్తం కావడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటన బేతంచర్ల మండలంలోని బోర్లగడ్డ వద్ద చోటు చేసుకుంది.
ఎమ్మెల్యే గన్మెన్ అప్రమత్తం కావడంతో దుండగులు స్కార్పియోలో అక్కడ్నుంచి పరారయ్యారు. తమకు అందిన సమాచారంతో బేతంచర్ల పోలీసులు దుండగుల స్కార్పోయోను వెంబడించి వాహనాన్ని, డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. స్కార్పియోలో ఉన్న మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంరెడ్డి ప్రధాన అనుచరుడు బత్తలూరు రామ్మోహన్ రెడ్డిని కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
కర్నూలులో టిడిపి సర్వసభ్య సమావేశంలో హాజరయ్యేందుకు వెళ్లిన ఆయనపై ఈ హత్యాయత్నం జరిగింది. తన కారును ఢీకొట్టేందుకు ప్రయత్నించగా చాకచక్యంగా తప్పించుకున్నారు. కర్నూలుకు వచ్చిన అనంతరం తనపై హత్యాయత్నం జరిగిందని బిసి జనార్ధన్ రెడ్డి ధృవీకరించారు. మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంరెడ్డి కుటుంబంపై ఆయన అనుమానం వ్యక్తం చేశారు.
తనకు బందోబస్తు కావాలని పోలీసులకు ఇప్పటికే తెలియజేసినట్లు ఆయన తెలిపారు. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుకు కూడా సమాచారం తెలియజేసినట్లు తెలిసింది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి ఎమ్మెల్యేగా అభ్యర్థిగా పోటీ చేసిన బిసి జనార్ధన్ రెడ్డి 17వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.