బిజెపి నేతపై హత్యాయత్నం:చేసిందెవరో కాదు భార్యే...ప్రియుడితో కలిసి స్కెచ్
విశాఖపట్టణం:విశాఖ జిల్లా సీలేరులో సంచలనం సృష్టించిన వ్యాపారి,స్థానిక బిజెపి నేత కారే అప్పలరాజు హత్యాయత్నం కేసును పోలీసులు ఛేదించారు. విచారణలో వెలుగుచూసిన విషయంతో పోలీసులే అవాక్కయ్యారు.
భర్త వేధింపులు భరించలేక భార్య తన ప్రియుడితో కలసి ఇంతటి అఘాయిత్యానికి పాల్పడిందని పోలీసుల దర్యాప్తులో తేలింది. దీంతో పోలీసులు అప్పలరాజు భార్య మహేశ్వరితోపాటు ఆమెకు సహకరించిన ప్రసాదు, దుర్గారావును అరెస్టు చేశారు. మరో ప్రధాన నిందితుడు, మహేశ్వరి ప్రియుడు నేమాల శ్రీనివాసరావు పరారీలో ఉన్నాడు. వివరాల్లోకి వెళితే...
భర్త వేధింపులు...భార్య పక్కచూపులు
సీలేరులో హోంనీడ్స్ వ్యాపారం చేస్తున్న కారే అప్పలరాజుకు తూర్పు గోదావరి జిల్లా తొండంగి మండలం ఎర్రయ్యపేట గ్రామానికి చెందిన మహేశ్వరి పెళ్లయింది. అయితే పెళ్లయిన నాటినుంచే భర్త తీవ్రంగా వేధింపులకు గురిచేస్తున్నట్లు మహేశ్వరి చెబుతోంది. అయితే మహేశ్వరికి రెండు నెలల క్రితం పొరుగు గ్రామానికి చెందిన నేమాల శ్రీనివాసరావుతో ఫోన్ ద్వారా పరిచయం ఏర్పడి సాన్నిహిత్యానికి దారితీసింది.
ప్రియుడితో గోడు...హత్యకు స్కెచ్
ఈ క్రమంలో ఆమె తన సంసార జీవితంలో పడుతున్న ఇబ్బందులను, భర్త తనను ఏవిధంగా టార్చర్ పెడుతున్నాడో అవన్నీ ప్రియుడు నేమాల శ్రీనివాసరావుకు వివరించింది. మహేశ్వరి గోడు ఆలకించిన శ్రీనివాసరావు దీనికి శాశ్వత పరిష్కారం కల్పిస్తానని హామీ ఇచ్చాడు. ఆ మేరకు మహేశ్వరి భర్త కారే అప్పలరాజు ను హత్య చేసేందుకు పథకం రచించాడు. ఇందుకు తనవద్ద జెసిబి ఆపరేటర్లుగా పనిచేసే కోటవురట్ల మండలం లింగాపురం గ్రామానికి చెందిన కొరుప్రోలు ప్రసాదు(25), సర్వసిద్ధి దుర్గారావు(22) ను పురమాయించాడు. వారు అప్పలరాజును హత్య చేసేందుకు అంగీకరించడంతో హత్యకు రంగం సిద్దం చేశాడు.
ప్లాన్...విఫలం...పరారు
పథకం ప్రకారం వారు జూన్ నెల 1వ తేదీ ఉదయం నేమాల శ్రీనివాసరావు తన అనుచరులతో 11 గంటలకు సీలేరు చేరుకున్నారు. సాయంత్రం వరకు రెక్కీ నిర్వహించారు. అదే రోజు రాత్రి అప్పలరాజుకు అతడి భార్య మహేశ్వరి భోజనంలో నిద్రమాత్రలు కలిపి పెట్టింది. ఇంట్లో ఉన్న కుక్కను కూడా కట్టేసింది. ఆ తరువాత మహేశ్వరి సహకారంతో నిందితులు ఇల్లు కమ్ దుకాణం అయిన ఆ నివాసంలోకి ప్రవేశించారు. నిద్రిస్తున్న అప్పలరాజు కాళ్లను ఒకరు పట్టుకోగా ఒకరు వృషణాలు నొక్కేసేందుకు ప్రయత్నించారు. అప్పలరాజు మెడకు చీర బిగించి చంపేందుకు మరో నిందితుడు ప్రసాద్ ప్రయత్నించాడు. అయితే ఈ క్రమంలో అప్పలరాజు పెద్దగా కేకలు వేయడంతో ముందు కాళ్లు పట్టుకున్న వ్యక్తి భయంతో పరారయ్యాడు. ప్రసాద్తో అప్పలరాజు పెనుగులాడుతూ కేకలు వేస్తుండటంతో చుట్టుపక్కల వారు వస్తున్న అలికిడి కావడంతో మిగిలిన ఇద్దరూ కూడా పారిపోయాడు.
పోలీసులు...చేధించారు ఇలా
అయితే పారిపోయే క్రమంలో వారు టీషర్ట్, చెప్పులు, హత్యాయత్నంలో భాగంగా వాడేందుకు తెచ్చిన సిరంజి అక్కడే వదిలి వెళ్లిపోయారు. అప్పలరాజు ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు...నిందితులు వదిలి వెళ్లిన దుస్తులు...చట్టుప్రక్కల ప్రాంతాల వ్యక్తులు ఇచ్చిన సమాచారం ఆధారంగా వారి కోసం గాలింపు చేపట్టారు. ఆ క్రమంలో సీలేరు సమీపంలోని మైదాన ప్రాంతంలోకి పారిపోతున్న దుర్గ, ప్రసాద్లను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. దాంతో వారు అసలు విషయం చెప్పారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన శ్రీనివాస్ పరారీలో ఉండగా, భార్య మహేశ్వరి, ప్రసాద్, దుర్గలను మంగళవారం అరెస్ట్ చేసి మీడియా ముందు హాజరుపర్చి ఆ తర్వాత కోర్టుకు తరలించారు. పరారీలో ఉన్న నిందితుడు నేమాల శ్రీనివాసరావు కోసం గాలిస్తున్నామని తెలిపారు.