పిఆర్వో మృతి: ఎంపీ ఎస్పీవై రెడ్డి కూతురిపై హత్య కేసు నమోదు
హైదరాబాద్: కర్నూలు జిల్లా నంద్యాల పార్లమెంటు సభ్యుడు ఎస్పీవై రెడ్డికి షాక్ తగిలింది. ఆయన కూతురు సుజలపై శుక్రవారం రాత్రి హత్య కేసు నమోదైంది. నంద్యాల పరిధిలో ఎస్పీవై రెడ్డి కుటుంబం ఆధ్వర్యంలో నడుస్తున్న 'నంది అకాడమీ స్కూల్' లో పీఆర్వోగా పనిచేస్తున్న సుమంత్ (25) అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో మరణించాడు.
మృతుడు సుమంత్ కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో నంద్యాల రూరల్ పోలీస్ స్టేషన్లో సుజలపై, మరో ఇద్దరిపై హత్యా నేరం కింద కేసు నమోదైంది. స్కూలులో పీఆర్వోగా పనిచేస్తున్న సుమంత్ పాఠశాలలో విద్యార్థులను చేర్చేందుకంటూ యాజమాన్యం వద్ద కొంత మేర నగదు తీసుకున్నాడు. అయితే అనుకున్న మేరకు విద్యార్థులను చేర్చలేని సుమంత్ నుంచి నగదును రాబట్టేందుకు యాజమాన్యం యత్నించింది.
ఈ క్రమంలో సుమంత్ నగదు వాపస్ ఇవ్వకపోవడంతో యాజమాన్యం ప్రతినిధులుగా రంగంలోకి దిగిన షఫీ, మురళిలు అతడిని తీవ్రంగా కొట్టారని ఆరోపణలు వచ్చాయి. దానివల్లనే అతను చనిపోయాడని, సుజల ప్రమేయం మేరకు వారు సుమంత్పై దాడి చేశారని ఆరోపణలు వచ్చాయి.
దీనిపై మృతుడి సోదరుడు సుమన్ ఫిర్యాదు మేరకు ఎస్పీవై రెడ్డి కూతురు సుజల, పాఠశాల ఉద్యోగులు షఫీ, మురళిలపై హత్య కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. గత ఏడాది కాలంగా ఎస్పీవై అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయనను సంప్రదించడానికి కుటుంబ సభ్యులు అనుమతించడం లేదు.
కాగా, గడచిన ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ టికెట్ పై నంద్యాల పార్లమెంటు నియోజకవర్గం నుంచి బరిలోకి దిగి విజయం సాదించిన ఎస్పీవై రెడ్డి ఆ తర్వాత అధికార పార్టీ తెలుగుదేశం పార్టీలో చేరారు.