అట్లకాడతో గుండెలో పొడిచి... హత్య:మద్యం ఎంత పని చేసింది!
గుంటూరు:తెలుగు రాష్ట్రాల్లో ఇటీవలి కాలంలో హత్యా ఘటనలను పరిశీలిస్తే వాటిలో మద్యం ప్రమేయం ఉన్న వాటి సంఖ్యే ఎక్కువగా కనిపిస్తున్నాయి. పలు సంఘటనల్లో హత్యకు గురైన వాళ్లని మద్యం తాగుదాం రమ్మని తీసుకెళ్లి హతమార్చిన ఉదంతాలే అత్యధికంగా ఉన్నాయి.
గుంటూరులో తాజాగా చోటుచేసుకున్న మరో హత్య ఈ మద్యం మహమ్మారి మనిషిని ఎంత దారుణంగా బలి తీసుకుంటుందో తేటతెల్లం చేస్తోంది. మద్యం తాగే విషయమై బావా,బావమరిదిల మధ్య చోటుచేసుకున్న వివాదం ఒకరి దారుణ హత్య కు దారి తీసింది. గుంటూరు జిల్లా కనపర్రు గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే...
పోలీసుల కథనం ప్రకారం...గుంటూరు-నర్సరావుపేట రహదారిలో నర్సరావుపేటకు సమీపాన ఉండే కనపర్రు గ్రామానికి చెందిన కుంచాల జోజయ్య(40) తాపీ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఇతడి అక్కబావలు రమణ, వల్లెపు శ్రీను కూడా ఇదే గ్రామంలో నివాసం ఉంటున్నారు. వల్లెపు శ్రీను కూడా తాపీ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. బావా,బావమరుదులు ఇద్దరికీ మద్యం సేవించే అలవాటు ఉంది.
ఈ నేపథ్యంలో జోజయ్య బావ వల్లెపు శ్రీను శనివారం ఉదయాన్నే మద్యం తాగాడు. ఈ క్రమంలో కనపర్రు గ్రామానికే చెందిన మరో తాపీ కార్మికుడు కుంచాల పిన్నారావు మోటారు బైకుపై వల్లెపు శ్రీను ఇంటి ముందుకు వచ్చి మద్యం తాగేందుకు సాతులూరు వెళదాం రమ్మని పిలిచాడు. విషయం తెలుసుకున్న జోజయ్య తన వావా అప్పటికే మద్యం తాగాడని తాను వస్తానంటూ మోటారు బైకు ఎక్కాడు. ఈ సందర్భంగా బావ, బావమరుదుల మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది.
అనంతరం పిన్నారావు, జోజయ్య మద్యం సేవించేందుకు అని సాతులూరు వైపు వెళ్లారు. దీంతో అప్పటికే మద్యం మత్తులో ఉన్న వల్లెపు శ్రీను తీవ్రమైన ఆగ్రహంతో రగిలిపోతూ ఇంట్లోకి వచ్చి భార్యను కత్తి అడిగాడు. భర్త మద్యం మత్తులో ఉండటంతో అతడు ఏం చేస్తాడోనని భయపడి ఆమె కత్తిని దాచిపెట్టింది. దీంతో అతడు ఇంట్లో ఉన్న అట్లకాడను తీసుకొని దాన్ని బొడ్డులో దాచి...సాతులూరు వెైపు వెళ్లాడు.
ఈ క్రమంలో సాతులూరులో మద్యం సేవించి పిన్నారావు, జోజయ్య మోటారుబైకుపై వస్తూ దారిలో ఎదురుపడ్డారు. వారి బండిని అడ్డుకున్న వల్లెపు శ్రీను బైక్ పై ఉన్న బావ జోజయ్యను కిందకు నెట్టాడు. దీంతో కిందపడ్డ జోజయ్యను వల్లెపు శ్రీను అట్లకాడతో గుండెలో పొడిచాడు. దీంతో జోజయ్య గిలగిలా కొట్టుకొని అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో పిన్నారావు భయంతో గ్రామంలోకి వచ్చి పరిస్థితి వివరించాడు.
దీంతో బంధువులు పరుగుపరుగున సంఘటన స్థలానికి వచ్చారు. అప్పటికే జోజయ్య మృతిచెందిన విషయాన్ని గుర్తించారు. దీంతో పోలీసులకు సమాచారం ఇవ్వగా డీఎస్పీ నాగేశ్వరరావు, సీఐ శోభన్బాబు గ్రామానికి వచ్చి మృతదేహాన్ని పరిశీలించి వివరాలు నమోదు చేసుకున్నారు. హత్య అనంతరం వల్లెపు శ్రీను పరారైనట్లు గుర్తించిన పోలీసులు అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
బావ తనను చంపేందుకు వస్తున్నాడని తెలియక ఆయన కోసం ఒక మద్యం సీసా కొని జేబులో పెట్టుకొని వస్తుండగా మరిది మనస్సును గుర్తెరగని బావ అతడిని బలితీసుకోవడం ఈ ఘటనలో కొసమెరుపు.