ఎంత డబ్బైనా ఇస్తాం: బాబు 'మంత్రి' వ్యాఖ్యపై చర్చ, 'జగన్! ఎమ్మెల్యే బానిసకాదు'
విజయవాడ: త్వరలో కేబినెట్లో ముస్లీం మంత్రిని నియమిస్తానని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం నాడు వెల్లడించారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. త్వరలో ఏపీ కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ జరగనున్నదనే ఊహాగానాలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి.
ఇప్పుడు స్వయంగా చంద్రబాబు కూడా త్వరలో కేబినెట్లోకి ముస్లీంను తీసుకుంటామని చెప్పారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు వ్యాఖ్యలు చర్చనీయాంశమవుతున్నాయి.
శనివారం బెజవాడలో పశ్చిమ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ఆధ్వర్యంలో ముస్లీంల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ముస్లీంలను ఉద్దేశించి మాట్లాడారు. త్వరలో కేబినెట్లో ముస్లీం మంత్రిని నియమిస్తామని చెప్పారు.
ముస్లీం రిజర్వేషన్లను కాపాడేందుకు ఎంతవరకైనా పోరాటం చేస్తామన్నారు. సుప్రీం కోర్టులో వాదనలు వినిపించేందుకు మంచి న్యాయవాదులను నియమిస్తామని, ఎంత డబ్బైనా ఇస్తామన్నారు. ముస్లీంలోని పేదలు అభివృద్ధిలోకి రావాలన్నారు.
ఎమ్మెల్యేలు అంటే బానిసలు కాదని జగన్ గుర్తుంచుకోవాలని ఎమ్మెల్యే జలీల్ ఖాన్ మండిపడ్డారు. ఎమ్మెల్యేలను గౌరవించకపోవడం వల్లే చెట్టుకు కాయలు రాలుతున్నట్లుగా ఎమ్మెల్యేలు వెళ్లిపోతున్నారని చెప్పారు. కోట్లు తీసుకొని పార్టీ మారామన్న ఆరోపణలను ధైర్యం ఉంటే జగన్ నిరూపించాలని సవాల్ చేశారు.
దానిని నిరూపిస్తే నేను రాజీనామా చేసి, మళ్లీ చంద్రబాబు నాయకత్వంలో ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమని జగన్కు సవాల్ చేశారు. తాము అభివృద్ధిని చూసే టిడిపిలో చేరుతున్నామని చెప్పారు.
ఇదిలా ఉండగా, ముస్లీం నేత కేబినెట్లోకి రానున్నారని చంద్రబాబు చెప్పిన వ్యాఖ్యలపై ఏపీ రాజకీయాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఎవరికి పదవి వరిస్తుందనే చర్చ జరుగుతోంది. ఆ పదవి వైసిపి నుంచి వచ్చిన జలీల్ ఖాన్కు ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు, పునర్ వ్యవస్థీకరణ ఉంటుందనే సంకేతాలు చంద్రబాబు ఇచ్చినందున ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మంత్రి పదవుల కోసం ఎదురు చూస్తున్నారు.