హిందూ సంప్రదాయంలో కన్యాదానం చేసిన ముస్లీం దంపతులు
విజయవాడ: హిందూ అమ్మాయిని పెంచుకున్న ఓ ముస్లీం కుటుంబం.. ఆమెకు హిందూ సంప్రదాయంలో పెళ్లి చేసిన సంఘటన కృష్ణా జిల్లాలోని విజయవాడలో చోటు చేసుకుంది. ఆమెను కిరణ్ కుమార్ అనే యువకుడు కట్నం తీసుకోకుండా బుధవారం పెళ్లి చేసుకున్నాడు.
విజయవాడలో షేక్ ఖాజావలీ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. ఆయన భార్య ప్యారీ, కుమారులు మనోజ్ కమల్, హమీద్ కమల్ ఉన్నారు. ఆదిలక్ష్మి అనే బాలిక గతంలో ఓ ప్రమాదంలో తల్లిదండ్రులను కోల్పోయింది. విషయం తెలుసుకున్న ఈ ముస్లిం దంపతులు ఆమెను ఏడేళ్ల వయస్సు నుంచి పెంచారు.
ఆదిలక్ష్మికి గుంటూరు జిల్లా సిరిపురం గ్రామానికి చెందిన హనుమంత రావు, ధనలక్ష్మిల కుమారుడు కిరణ్ కుమార్తో బుధవారం పెళ్లి చేశారు. కట్నం లేకుండా వివాహం చేసుకునేందుకు కిరణ్ కుమార్ కుటుంబం ముందుకు వచ్చింది. అయితే, హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం కావాలని విజ్ఞప్తి చేసింది.
దీంతో, బుధవారం ఆటోనగర్లోని ఎగ్జిబిషన్ సంఘం మందిరంలో బుధవారం పెళ్లి జరిగింది. అమ్మాయి ఇంటర్ వరకు చదివింది. వరుడు కిరణ్ కుమార్ బిటెక్ చదివాడు. ఈ వివాహానికి టిడిపి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, గజల్ శ్రీనివాస్ హాజరయ్యారు. కిరణ్ కుమార్, ఆదిలక్ష్మికి ఉపాధి చూపిస్తామని గజల్ శ్రీనివాస్ చెప్పారు.