ఎంవీవీఎస్ మూర్తి అంత్యక్రియలు పూర్తి...అంతిమయాత్రకు భారీగా హాజరైన జనం
విశాఖపట్నం:టిడిపి ఎమ్మెల్సీ ఎంవీవీఎస్ మూర్తి అంత్యక్రియలు విశాఖ రుషికొండ స్మృతివనంలో పూర్తయ్యాయి. ప్రభుత్వ లాంఛనాలతో ఎంవీవీఎస్ మూర్తి అంతిమ సంస్కారాలు ఘనంగా నిర్వహించారు.
మూర్తి అంత్యక్రియలకు ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు సీఎం చంద్రబాబు, మంత్రులతో సహా టిడిపి నేతలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఎంవివిఎస్ మూర్తి అంతిమయాత్రలో గీతం విద్యార్థులు, మూర్తి అభిమానులతో పాటు స్థానికులు భారీగా పాల్గొనగా సిరిపురం, మూడో పట్టణ పీఎస్, శాంతి ఆశ్రమం, రిషికొండ మీదుగా గీతం వర్శిటీ వద్దకు ఈ యాత్ర కొనసాగింది.
అంతిమ యాత్ర...అంత్యక్రియలు
గీతం విద్యాసంస్థల అధినేత, టిడిపి ఎమ్మెల్సీ ఎంవీవీఎస్ మూర్తి అంతిమ సంస్కారాలు ప్రభుత్వ లాంఛనాలతో విశాఖ రుషికొండలోని గీతం విద్యాసంస్థలకు సమీపంలోనే నిర్వహించారు. అంతకు ముందు ఆయన నివాసం నుంచి అశేష జనవాహిని మధ్య గీతం విద్యాసంస్థల వరకూ అంతిమయాత్ర కొనసాగింది.
భారీగా...విఐపిల రాక
ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రులు చిన రాజప్ప, నారా లోకేశ్, గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడు, కళా వెంకట్రావు, విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, రాజకీయనాయకులు మూర్తి అంత్యక్రియలకు హాజరయ్యారు.
పెద్ద దిక్కు...కోల్పోయింది
ఎంవీవీఎస్ మూర్తి అకాల మృతితో విశాఖ పెద్దదిక్కును కోల్పోయిందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. విశాఖ చేరుకున్న ఆయన మూర్తి భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంవీవీఎస్ మూర్తి వ్యాపారవేత్తగా, విద్యావేత్తగా ఎన్నో విజయవంతమైన కార్యక్రమాలు నిర్వహించారని కొనియాడారు. పది మందికి ఉపయోగపడేలా జీవితాన్ని మలుచుకున్నారన్నారు. ఉన్నత ప్రమాణాలతో గీతం విద్యా సంస్థను నెలకొల్పి ప్రపంచస్థాయిలో గుర్తింపు తీసుకొచ్చారని పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
వ్యక్తి కాదు వ్యవస్థ...అతి పెద్ద లోటు...
విశాఖలో మూర్తి భౌతికకాయానికి నివాళులర్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన కుటుంబసభ్యులను పరామర్శించి ఓదార్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ...ఎంవీవీఎస్ మూర్తి రాజకీయాలకే వన్నె తెచ్చారని అన్నారు. ఆయన వ్యక్తి కాదని...వ్యవస్థ అని చంద్రబాబు కొనియాడారు. మూర్తి మరణం తనకు వ్యక్తిగతంగానే కాకుండా టిడిపి పార్టీకి పూడ్చుకోలేని అతి పెద్ద లోటు అన్నారు.