టి కోసం ఎంతో చేశా, కెసిఆర్ తొందరపడ్డారు: జైపాల్
హైదరాబాద్/నల్గొండ: తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకురావడం తన కల అని కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తానెంతో కృషి చేశానని చెప్పారు. తన కృషి ఎంటో చెబితే సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందులు ఎదురవుతాయని జైపాల్ రెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు ఈ ప్రాంత కాంగ్రెస్ నేతలు ఐక్యంగా పోరాటం చేశారని చెప్పారు.
తెలంగాణ రాష్ట్ర సమితి, కాంగ్రెస్ పార్టీల పొత్తు విషయం రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ దిగ్విజయ్ సింగ్ చూసుకుంటారని ఆయన అన్నారు. టిఆర్ఎస్ అధ్యక్షుడు కె చంద్రశేఖర్ రావు తొందరపడి సీట్లు ప్రకటించడం ఎవరికీ మంచికాదని ఆయన అన్నారు. ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి గెలిచే సత్తా కాంగ్రెస్కు ఉందని జైపాల్ రెడ్డి అన్నారు.టిఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు సంయమనం పాటించాలని కోరారు. తాను తెలంగాణ పిసిసి రేసులో లేనని తెలిపారు. ఎక్కడ్నుంచి పోటీ చేసేది సమయం వచ్చినప్పుడు చెబుతానని జైపాల్ రెడ్డి తెలిపారు.
మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో లేరని, కాంగ్రెస్ పార్టీలో ఉండి ఆయన ఎలా వ్యవహరించారో అందరికీ తెలుసునని జైపాల్ రెడ్డి అన్నారు. కిరణ్ పార్టీపై స్పందించాలని మీడియా కోరగా.. తనకంటే 20ఏళ్లు చిన్నవాడైన కిరణ్ గురించి ఏం మాట్లాడాలి అని అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ పెట్టడం మంచిదేనని, అతనికి బలముందని గొప్పగా ఊహించుకుంటున్నాడని జైపాల్ రెడ్డి అన్నారు.
పార్టీ గెలుపే ధ్యేయం: రాజగోపాల్ రెడ్డి
నల్గొండ: రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా పని చేస్తామని ఆ పార్టీ పార్లమెంటు సభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా భువనగిరిలోని వివేరా హోటల్లో ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ రుణం తీర్చుకునేందుకు, పార్టీ అధిష్టానం నిర్ణయించిన అభ్యర్థుల విజయానికి కృషి చేస్తామన్నారు.
సామాజిక తెలంగాణ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని, మున్సిపల్, అసెంబ్లీ, లోకసభ ఎన్నికల్లో ప్రజలు గెలిపిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీకి ఓటేస్తే మురిగిపోయినట్లేనని రాజగోపాల్ రెడ్డి అన్నారు. కేవలం ఓట్లూ, సీట్ల కోసమే టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సామాజిక తెలంగాణ అంటున్నారని ఆరోపించారు. ఉమ్మడి రాష్ట్రంలో బిసిలకు ముఖ్యమంత్రి పదవి ఇస్తానని ఎందుకు అనలేదని ఆయన చంద్రబాబును ప్రశ్నించారు.
మహబూబ్నగర్ నుంచి పోటీ: శ్రీనివాస్ గౌడ్
తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె చంద్రశేఖర్ రావు కోరిక మేరకు తాను తన ఉద్యోగానికి రాజీనామా చేయనున్నట్లు తెలంగాణ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఉద్యోగానికి రాజీనామా చేసి మహబూబ్ నగర్ శాసనసభ స్థానానికి పోటీ చేయాల్సిందిగా కెసిఆర్ కోరినట్లుగా ఆయన చెప్పారు. సోమవారం తన ఉద్యోగానికి రాజీనామా చేస్తానని వెల్లడించారు.