నా ఆశ ఆశయం మీద...సీఎం పదవిపై కాదు; విరాళాలు అలా ఇవ్వాలని...!:పవన్ కల్యాణ్
అమరావతి:"నా ఆశ ఆశయం మీద ఉంది...సీఎం పదవిపై కాదు...సీఎం ఆకాంక్షతో రాజకీయాల్లోకి వస్తే...వేరుగా ఉండేది"...అని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రకటించారు.
తూర్పు గోదావరి జిల్లాకు చెందిన పలువురు నాయకులు మాదాపూర్ లోని జనసేన కార్యాలయంలో పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ..."బలమైన నాయకులు లేకపోతే ఆశయాలను ముందుకు తీసుకెళ్లలేం. అందుకే నాయకుల కోసం వేచి చూస్తున్నాను. కులాలను వాడుకుని కొందరు వ్యక్తులు, వాళ్ల కుటుంబాలే ఎదుగుతున్నాయి. ఆ కులాల ప్రజలు మాత్రం ఎదగలేదు.వాళ్లను ఓటు బ్యాంకుగానే వాడుకుంటున్నారు" అని విమర్శించారు.
తూర్పు గోదావరి జిల్లా జనసేన కో-కన్వీనర్ శెట్టిబత్తుల రాజబాబు నేతృత్వంలో ఆ జిల్లాకు చెందిన నాయకులు బుధవారం ఇక్కడ మాదాపూర్లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరారు. ఈ సందర్భంగా పవన్ పార్టీ నేతలను ఉద్దేశించి ప్రసంగిస్తూ...ఏమీ ఆశించకుండా రాజకీయాలు చేయాలని చెప్పారు.
"నేను ముఖ్యమంత్రిని కావచ్చు... కాకపోవచ్చు...కానీ జనసేన సిద్ధాంతాల కోసం చివరి శ్వాస వరకు పోరాటం చేస్తాను...రాజకీయ పోరాటాల ద్వారా అన్ని సమస్యలకూ పరిష్కారం కనుక్కోగలమన్నారు."...అని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకూడదని లారీ టైర్లతో చెప్పులు కుట్టించుకున్న మహానుభానుడు బీఎస్పీ అధ్యక్షుడు కాన్షీరాం తనకు ఆదర్శమన్నారు. అందుకే పార్టీ కోసం విరాళాలను అడగడం లేదని.. ఎవరైనా వాళ్ల ఇష్టంతోనే ఇవ్వాలని చెప్పారు.
ఎస్సీ వర్గాలు ఉద్యోగాలు చేసే స్థాయి నుంచి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నానని పవన్ అన్నారు. ఎస్సీలు కూడా ఎదగాల్సిందే అన్నారు. ఈ వర్గాలకు సంబంధించి వందమంది ఎస్సీ ఎంటర్ ప్రెన్యూర్స్ని తయారు చేస్తానని తాను మాటిస్తున్నానని చెప్పారు. టీడీపీ గానీ, వైసేపీ గానీ ఇప్పటివరకు ఎంతమంది ఎస్సీ పారిశ్రామికవేత్తలను తయారు చేశాయో చెప్పాలని ఆయన సవాల్ విసిరారు.
ఇదిలావుంటే ఎస్సీల నుంచి 100 మంది ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల్ని తయారు చేస్తానన్న పవన్ కళ్యాణ్ హామీ రాజకీయ పార్టీల్లో చర్చనీయాంశం అయినట్లు తెలుస్తోంది. పవన్ అడుగులు, హామీలు వినూత్నంగా ఉంటూ ఆయా వర్గాలను ఆకర్షించేవిధంగా ఉంటున్నాయని రాజకీయ శ్రేణులు విశ్లేషిస్తున్నాయి. కులానికో భవనం కట్టిస్తామనో...కులానికో కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామనో పదే పదే అలాంటి హామీలను మాత్రమే ఇచ్చే సాంప్రదాయ రాజకీయ పార్టీల్లా కాకుండా...పవన్ కళ్యాణ్ కులాల సమస్యల మూలాల్లోకి వెళ్లి పరిష్కారం కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లుగా ఉన్నాయని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.