ఔను..నా కాళ్లు కూడా వణుకుతున్నాయ్, లోకేశ్ కామెంట్లపై ఆర్కే రోజా సెటైర్లు
టీడీపీ నేతలపై ఏపీఐఐసీ చైర్మన్ ఆర్కే రోజా మండిపడ్డారు. మంగళవారం సభలో లోకేశ్ వ్యాఖ్యలపై ఉదయాన్నే ప్రెస్మీట్ పెట్టించారని ఆరోపించారు. తనపై ఎమ్మెల్యేలు, మంత్రులు కామెంట్లు చేశారని లోకేశ్కి అనిపిస్తే నిన్న రాత్రే ఖండించొచ్చు కదా అని ప్రశ్నించారు. ఎవరో ఫీడింగ్ ఇస్తే తప్పా లోకేశ్కు మెలకువ రాలేదా అని అన్నారు.
ఉదయమే ప్రెస్మీట్
లోకేశ్తో ప్రెస్మీట్ పెట్టించాల్సిన అవసరం ఏముందని రోజా ప్రశ్నించారు. మరికొందరు ఒకడుగు ముందుకేసి లోకేశ్ను చూస్తే మంత్రుల కాళ్లు వణుకుతున్నాయని చెప్తున్నారు. మంత్రుల గురించి తెలియదు కానీ.. నా కాళ్లు వణుకుతున్నాయని రోజా పేర్కొన్నారు. లోకేశ్ ఎప్పుడు ఏం మాట్లాడుతాడో అని భయమేస్తుందని సెటైర్లు వేశారు.
మంగళగిరి అని పలకలేరు..
గత ఎన్నికల్లో తాను పోటీచేసిన మంగళగిరి సరిగా పలకలేని లోకేశ్ను చూస్తే ఎవరికైనా భయమేస్తుందా అని రోజా సెటైర్లు వేశారు. మంగళగిరి అని పలకడానికి లోకేశ్ ట్యూషన్ పెట్టించుకున్నారని విమర్శించారు. టీడీపీలో కళాకారులను అవమానిస్తున్నారని రోజా ఆరోపించారు. చట్టసభలో బాలకృష్ణను ఎందుకు మాట్లాడనీయడం లేదని అడిగారు. కళాకారులు అంటే అంత చులకనభావమా అని రోజా నిలదీశారు.
అలా ఎలా?
శాసనసభలో సభ్యుడి కానీ పేరును అసెంబ్లీలో ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రస్తావించడం సరికాదని మాజీ మంత్రి, టీడీపీ నేత నారా లోకేశ్ అన్నారు. బుధవారం ఉదయం విజయవాడలో ప్రెస్మీట్ పెట్టి మరీ ఖండించారు. సభలో చంద్రబాబు తర్వాత తనపైనే వైసీపీ నేతలు విమర్శించారని పేర్కొన్నారు. తాను పై చదువుల కోసం అమెరికా వెళ్లానని లోకేశ్ వివరించారు. దాదాపు ఎనిమిదేళ్లు అమెరికాలో ఉన్నానని గుర్తుచేశారు. బీటెక్ చేశాక వరల్డ్ బ్యాంక్లో జాబ్ చేశానని తెలిపారు. తర్వాత ఎంబీఏ చేసి ఇండియా తిరిగొచ్చానని తెలిపారు. తాను తెలుగులో తప్పు మాట్లాడటంతో జరిగిన నష్టం ఏంటి అని లోకేశ్ ప్రశ్నించారు.
నష్టం జరిగిందా..?
వర్దంతిని జయంతి అనడం వల్ల ఏపీకి జరిగిన నష్టం ఏంటి అని లోకేశ్ ప్రశ్నించారు. రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులు వెనక్కి వెళ్లిపోయాయా అని అడిగారు. లేదంటే పోలవరం ప్రాజెక్టు ఆగిపోయిందా అని నిలదీశారు. అమరావతి పనులకు ఉన్న ఫలంగా ఏమైనా సమస్య వచ్చిందా అని లోకేశ్ వైసీపీ నేతలను అడిగారు. జరిగిన నష్టం ఏంటీ అని లోకేశ్ వైసీపీ నేతలకు సవాల్ విసిరారు.