నా ఇద్దరు పిల్లలు సాంప్రదాయ క్రైస్తవులు...అందుకే దేవుడు అలా పుట్టించాడు:పవన్ కళ్యాణ్
ఏలూరు:ఒక మతానికి ఒక రూల్ అమలు చేస్తే అన్ని మతాలకీ అదే రూల్ అమలు చేయాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఏలూరు క్రాంతి కళ్యాణ మండపంలో పాస్టర్ల అసోషియేషన్ తో సమావేశం సందర్భంగా పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
Recommended Video
ఈ క్రమంలో సమాజంలో క్రైస్తవులు పడుతున్న ఇబ్బందులను పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువచ్చారు క్రైస్తవ పాస్టర్లు. ఈ విషయమై స్పందించిన పవన్ కళ్యాణ్ ఒక్కో మతానికి ఒక్కో నిబంధన అమలు చెయ్యడం సరికాదన్నారు. రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెట్టేందుకు గాను జనసేన పార్టీ క్రైస్తవులకు అండగా ఉంటుందని హామీ పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా వారికి హామీ ఇచ్చారు.
క్రిస్టియానిటీ అంటే అందరి దృష్టిలో ఒక మతం కావొచ్చని కానీ తాను మాత్రం అది బాధ్యతగా భావిస్తానని తెలిపారు. తనకు దేశభక్తిని నేర్పింది కూడా క్రిస్టియన్ స్కూలేనని...సెయింట్ జోసెఫ్ ఇంగ్లీషు మీడియం స్కూల్లో తాను చదువుకున్నానని గుర్తుచేసుకున్నారు. తాను ఓ బాధ్యతతో ఇంతదూరం ప్రయాణం సాగించగలిగానంటే అందుకు కారణం అప్పుడు ఆ పాఠశాలలో నేర్చుకున్న విషయాలే పునాది అన్నారు.
తాను చిన్ననాటి నుంచే సర్వమతాల సారాన్ని అర్థం చేసుకుంటూ వస్తున్నానని చెప్పుకొచ్చారు. ఓట్ల కోసం తాను క్రైస్తవ్యానికి మద్దతు తెలపడం లేదన్నారు. విదేశాల నుంచి వచ్చిన క్రైస్తవం ఇంతమంది మనసును గెలుచుకుందంటే అందుకు కారణం ఆ మతంలో ఉన్న సేవా దృక్పథమేనని పవన్ కళ్యాణ్ ప్రస్తుతించారు. క్రైస్తవుల సేవకి ఎలాంటి అడ్డంకులు ఇబ్బందులు ఎదురైనా జనసేన పార్టీ వారికి అండగా ఉంటుందన్నారు. అలాగే తాను మనస్ఫూర్తిగా దేశ సమగ్రతని, మతాల మధ్య సామరస్యాన్ని కాపాడుతానని హామీ ఇచ్చారు.
అన్ని మతాలను అర్థం చేసుకోవడానికే దేవుడు నా ఇద్దరు పిల్లలని క్రిస్టియన్లుగా పుట్టించాడని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. తన ఇద్దరు బిడ్డలు సనాతన సాంప్రదాయ క్రైస్తవ్య పద్దతులు పాటిస్తారని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ఒక పార్టీ ఒక మతానికే అంకితమవ్వదని...అన్ని మతాల్లో తనకు అభిమానులు ఉన్నారని పవన్ కళ్యాణ్ వివరించారు. తాను ప్రజలకు న్యాయం చేస్తానని అనిపిస్తేనే తనకు మద్దతు ఇవ్వాలని క్రైస్తవ పాస్టర్లను కోరారు. అయితే మీరు మద్దతు ఇచ్చినా ఇవ్వకపోయినా జనసేన పార్టీ మాత్రం క్రైస్తవులకు అండగా ఉంటూనే ఉంటుందని పవన్ వారికి హామీ ఇచ్చారు.