రాజధానిపై మైసూరా, బాబుకు జగన్ డెడ్లైన్, హెచ్చరిక
హైదరాబాద్/శ్రీకాకుళం: రాజధాని విషయమై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత మైసూరా రెడ్డి గురువారం బహిరంగ లేఖ రాశారు. రాష్ట్ర విభజన అనంతరం రాజధాని ప్రధాన సమస్య అయిందన్నారు.
ఏపీ రాజధాని ఏర్పాటు ప్రజలందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలని లేఖలో పేర్కొన్నారు. ప్రభుత్వ స్థలం ఉన్నచోట రాజధాని ఏర్పాటు చేస్తే వృద్ధి చెందుతామన్నారు. రాజధాని ఏర్పాటు కోసం ప్రయివేటు భూములు కొనుగోలు సరికాదన్నారు. ప్రయివేటు భూములు కొనుగోలు చేసి రాజధానిని ఏర్పాటు చేయడం చాలా ఖర్చుతో కూడుకున్న పని అన్నారు.
50వేల ఎకరాల ప్రభుత్వ భూమి లభించేచోట రాజధాని నిర్మాణం జరగాలని మైసూరా రెడ్డి పేర్కొన్నారు. ప్రాంతీయ విభేదాలు లేకుండా ప్రభుత్వ భూమిని గుర్తించాలన్నారు. అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలన్నారు. రాజధాని విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సునిశితంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరారు.
రాజధాని అంశంపై కేంద్రం వేసిన శివరామకృష్ణన్ కమిటీ ఇంకా కొన్ని ప్రాంతాలలో పర్యటించాలేదన్నారు. కేంద్రం పైన ఆధారపడి ప్రయివేటు భూములు కొని, ఇబ్బందులు పడవద్దన్నారు. వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్రకు ప్రత్యేక హోదా, ప్యాకేజీల విషయమై అడుగు కూడా ముందుకు పడలేదన్నారు.
బాబుకు నెల రోజుల గడువిచ్చిన జగన్
రైతుల రుణమాఫీ విషయమై చంద్రబాబుకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి నెల రోజుల గడువు ఇచ్చారు. జగన్ గురువారం శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రుణమాఫీ విషయమై మరో నెల రోజులు ఎదురు చూస్తామని చెప్పారు. మొదట రుణమాఫీ అన్న చంద్రబాబు ఇప్పుడు రీషెడ్యూల్ అంటున్నారని విమర్శించారు. రీషెడ్యూల్ సహజమే అన్నారు. అలాంటిది తానే రీషెడ్యూల్ చేస్తున్నట్లు బాబు గొప్పలకు పోతున్నారన్నారు.
రుణమాఫీపై నెల రోజుల్లో స్పష్టత రాకుంటే రైతులతో కలిసి ఉద్యమిస్తామని చెప్పారు. డ్వాక్రా రుణాలు తీర్చాలంటూ బ్యాంకర్లు మహిళలను ఒత్తిడి చేస్తున్నారన్నారు. అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. పంట నష్టపోయిన రైతులకు రుణాల రీషెడ్యూల్ సరికాదన్నారు. ప్రజలకు హామీలు ఇచ్చే చంద్రబాబు పైన ఏం కేసు పెట్టాలని ప్రశ్నించారు. రైతులకు మేలు చేయాలన్న ఆలోచన కానీ, సంకల్పం కానీ, చిత్తు శుద్ధి కానీ టీడీపీకీ లేవన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో రుణమాఫీ ఇచ్చామని చంద్రబాబు చెప్పడం సరికాదన్నారు. రాష్ట్ర విభజనకు అన్ని రకాలుగా సహకరించింది టీడీపీ కాదా అన్నారు. రైతులను ఆదుకుంటామని చెప్పడంలో చిత్తశుద్ధి ఉంటే కోటయ్య కమిటీ ఎందుకు వేశారన్నారు. కడుపు మండిన రైతు దుస్థితి ఎలా ఉందో మీకు తెలుసా? అని ప్రశ్నించారు. రైతులు ఓట్లతో గద్దెనెక్కిన బాబు రైతు రుణమాఫీపై మీనమేషాలు లెక్కిస్తుంటే చూస్తూ ఊరుకోమన్నారు. ముఖ్యమంత్రి రుణమాఫీ ఆలస్యం చేస్తే తాను నిరాహార దీక్షకు దిగుతానని హెచ్చరించారు. చంద్రబాబు నాయుడు అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చారని జగన్ విమర్శించారు. ఎర్ర చందనం విషయంలో అధికార పార్టీ పొంతనలేని మాటలు మాట్లాడుతోందన్నారు.