చంద్రబాబు ఇంటికి మైసూరా, ఎంపీ అవినాష్ రెడ్డీ దీక్ష
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎంవీ మైసూరా రెడ్డి మంగళవారం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడను ఆయన నివాసంలో కలిశారు. తన సోదరుడి కుమార్తె వివాహానికి సంబంధించి ఆహ్వానించేందుకు మాత్రమే తాను చంద్రబాబును కలిసినట్లు మైసూరా తెలిపారు. ఇందులో ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని చెప్పారు.
అవినాశ్ రెడ్డి దీక్ష
రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు (ఆర్టీపీసీ)లో భూనిర్వాసితుల కోసం కడప వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుడు అవినాశ్ రెడ్డి, ఎమ్మెల్సీ నారాయణ రెడ్డి మంగళవారం దీక్ష చేపట్టారు. ఆర్టీపీసీ, భూములు కోల్పోయిన రైతుల మధ్య చర్చలు విఫలం కావడంతో భూనిర్వాసితులు రిలే దీక్ష చేపట్టారు. పదిహేను రోజులుగా రైతులు ఆందోళన చేస్తున్నారు. దీనికి అవినాశ్ మద్దతు పలికారు. నిర్వాసితులకు న్యాయం జరిగే వరకు కలిసి పోరాడుతామన్నారు.
'అసెంబ్లీని సమావేశపర్చండి'
ఆంధ్రప్రదేశ్ రాజధాని కోసం భూసేకరణపై అసెంబ్లీని సమావేశ పరచాలని గుంటూరు జిల్లా తుళ్లూరు మాజీ ఎంపిపి మల్లెల హరేంద్రనాథ్ చౌదరి సభాపతి కోడెల శివప్రసాద్కు వినతి పత్రం అందజేశారు. గుంటూరులో కొంత మంది రైతులతో కలిసి మాజీ ఎంపీపీ హరేంద్ర స్పీకర్ కోడెలతో భూసేకరణపై చర్చించారు.
ల్యాండ్ పూలింగ్ విధానంపై ప్రజా ప్రతినిధుల అభిప్రాయాలు సేకరించాలన్నారు. విజయవాడ పరిసర ప్రాంతాల్లో రాజధాని ఉంటుందని సీఎం చంద్రబాబు అసెంబ్లీలో ప్రకటించారు. ప్రజాప్రయోజనాల కోసమే రాజధాని అంటున్న ప్రభుత్వం ప్రత్యేక సమావేశాలు నిర్వహించి ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలన్నారు.
రాజధాని కోసం 24 వేల రైతు కుటుంబాలు 18 గ్రామాల్లో లక్షల మంది వ్యవసాయ కూలీలు, మధ్య తరగతి కుటుంబాల వారు రోడ్డున పడుతున్న నేపథ్యంలో పాలకులు నష్టపోతున్న రైతు కుటుంబాల పట్ల చిత్తశుద్ధితో వ్యవహరించాలన్నారు. ఈ సందర్భంగా స్పీకర్ డాక్టర్ కోడెల మాట్లాడుతూ భూసేకరణ, ఇతర అంశాలను ప్రభుత్వంతో చర్చించి రైతులకు న్యాయం చేస్తామన్నారు.