అదే భరించలేకపోయా, విజయసాయికి ఇస్తే నాకేంటి!: జగన్పై మైసూరా
విజయవాడ: తాను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు అండగా నిలిచానని, కానీ తర్వాత తన వెనుక గోతులు తవ్వారని, దానిని తాను భరించలేకపోయానని మైసూరా రెడ్డి వైసిపి అధినేత జగన్ పైన మండిపడ్డారు. ఆయన ఓ టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడారు.
జగన్కు డబ్బు ధ్యాస తప్ప మానవీయ విలువలు లేవన్నారు. 2019 నాటికి జగన్ రాజకీయ భవిష్యత్తు ఏమిటో తనకు తెలియదని చెప్పారు. రాజ్యసభ పదవిని తాను అడగలేదని, నాకే ఇస్తానని జగన్ ఏడాదిన్నరగా చెబుతున్నారన్నారు.
ప్రస్తుతానికి తనకు ఏ పార్టీలో చేరే ఉద్దేశ్యం లేదని చెప్పారు. తన తర్వాత రాజకీయ ప్రయాణం గురించి ఇప్పుడే చెప్పలేనని చెప్పారు. తనను బ్రేక్ ఫాస్ట్కు పిలిచి జగన్ తనకు వైసిపి పార్టీ కండువా కప్పారని చెప్పారు. తనను జగన్ కరివేపాకులా పక్కన పెట్టారన్నారు.
కష్టకాలంలో తాను పార్టీని కాపాడానని, అలాంటి తనను జగన్ కరివేపాకులా తీసి పక్కన పడేశారని మైసూరా రెడ్డి అన్నారు. తాను అవమానాలు భరించలేకే వైసిపిని వీడానని చెప్పారు. తన వెనుకే గోతులు తీయడాన్ని తాను భరించలేకపోయానని చెప్పారు. తాను పార్టీలో ఎన్నో భరించానని, సహించానని చెప్పారు.
పార్టీ వదలడానికి, పదవికి ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. రాజ్యసభ పదవిని విజయ సాయి రెడ్డికి ఇచ్చినా, మరొకరికి ఇచ్చినా తనకు సంబంధం లేదని చెప్పారు. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డిని, జగన్ను పోల్చలేమని మైసూరా చెప్పారు.