గ్రేటర్ రాయలసీమను రాజధాని చేయండి, ఐక్యత కోసమే గతంలో త్యాగం, సీఎం జగన్కు మైసూరారెడ్డి లేఖ
రాజధాని మార్పుకు సంబంధించి ఏపీలో పొలిటికల్ హీట్ సెగలు రేపుతోంది. అమరావతి రాజధానిని మార్చొద్దని కొందరు.. కర్నూలు, అమరావతిలో మినీ సెక్రటేరియట్ ఏర్పాటు చేయాలని ఇంకొందరు కోరుతున్నారు. తమ అభిప్రాయాలను వివరిస్తూ మరికొందరు నేతలు సీఎం జగన్కు లేఖలు కూడా రాస్తున్నారు. మాజీ ఎంపీ మైసూరారెడ్డి లేఖ రాశారు. రాయలసీమ ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని కోరారు. లేఖలో మాజీ మంత్రి శైలజానాథ్, దినేశ్ రెడ్డి పలువురి పేర్లు కూడా ఉన్నాయి.
గ్రేటర్ రాయలసీమ..
నవ్యాంధ్ర రాజధాని మార్పులపై జీఎన్ రావు కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడంతో ఏపీలో ఎముకలు కొరికే చలిలో కూడా సెగలు పుట్టించే రాజకీయాలు జరుగుతున్నాయి. విశాఖపట్టణాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా పరిగణించాలనే ప్రతిపాదనను మాజీ ఎంపీ మైసూరారెడ్డి తప్పుపట్టారు. రాజధానిని ఉత్తరాంధ్రలో కాకుండా గ్రేటర్ రాయలసీమ పరిధిలో ఏర్పాటు చేయాలని సూచించారు.
సీమకు న్యాయం
గ్రేటర్ రాయలసీమకు ప్రాధాన్యం ఇవ్వడంతో సీమకు న్యాయం జరుగుతోందన్నారు. పరిపాలన వికేంద్రీకరణ జరగడంలో తప్పులేదన్నారు. కానీ రాయలసీమకు మాత్రం న్యాయం జరగాలనే విషయం మరచిపోవద్దని చెప్పారు. గతంలో ఐక్యత కోసం రాజధాని కర్నూలును తెలుగువారు త్యాగం చేశారని గుర్తుచేశారు. ఇప్పుడు మరోసారి అలాంటి పరిస్థితి ఎదురుకావద్దని సూచించారు. సీమ ప్రజల త్యాగాలు వృథా కాకుడదని మైసూరారెడ్డి అభిప్రాయపడ్డారు.
రైతుల ఆందోళన
అమరావతిలో రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతుల ఆందోళన కొనసాగుతోంది. రాజధానిని మార్చొద్దని వారు నిరసనను కంటిన్యూ చేస్తున్నారు. వారికి టీడీపీ, జనసేన ఇతర పార్టీలు మద్దతు తెలిపాయి. రైతుల గోడు పట్టించుకోకుండా, సీఎం జగన్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు.
మినీ సెక్రటేరియట్
మరోవైపు బీజేపీ ఎంపీ టీజీ వెంకటేశ్ కొత్త వాదనను తెరపైకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. విశాఖపట్టణంలో సెక్రటేరియట్ నిర్మిస్తున్నందున.. కర్నూలు, అమరావతిలో మినీ సెక్రటేరియట్ నిర్మించాలని కోరారు. దీనిపై అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని సీఎం జగన్మోహన్ రెడ్డిని కోరారు. అలా కాదని మొండిగా వెళితే రాయలసీమ ఐక్య వేదిక తరఫున పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.