ఇంకా మిస్టరీనే?: ఆమెను చంపిందెవరు?.. ఎవరి కన్ను పడింది..
విశాఖపట్నం: గోపాలపట్నం శివారు ప్రాంతమైన కొత్తపాలెంలో రెండు రోజుల క్రితం ఓ మహిళ హత్యకు గురైంది. ఇటీవలే నమోదైన మిస్సింగ్ కేసును బట్టి ఆమెను సంతోషినగర్లో నివాసిగా భావిస్తున్నారు. అయితే అదృశ్యమైన మహిళ.. హత్యకు గురైన మహిళ ఒక్కరేనా? అన్నది ఇంకా తేలాల్సి ఉంది. హత్యకు గురైన మహిళ గురించి స్థానికులు పోలీసులకు కొంత సమాచారం అందించారు.
ఎవరా యువతి?:
ఒడిశా ప్రాంతానికి చెందిన ఆ అమ్మాయి అక్కడి అబ్బాయినే ప్రేమ వివాహం చేసుకున్నట్టు చెబుతున్నారు. పెళ్లి తర్వాత ఇద్దరు కలిసి బతుకుదెరువు కోసం గోపాలపట్నం సమీపంలోని ఎల్లపువానిపాలెంకు వచ్చినట్టు చెప్పారు. ఆమె భర్త ఓ సింగర్ అని, ఒడిశా, గోవా, రాయఘడ్, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో నిర్వహించే సినీ ఆర్కెస్ట్రా వెళ్తుండేవాడని అన్నారు. భార్య కూడా పాటలు పాడుతూ, వ్యాఖ్యాతగా వ్యవహరిస్తుండేదన్నారు.
భార్యాభర్తల మధ్య విభేదాలు:
ప్రేమ వివాహమే అయినప్పటికీ వీరి మధ్య తీవ్ర మనస్పర్థలు ఉన్నట్టు చెబుతున్నారు. భార్యతో గొడవల కారణంగా.. భర్త సరిగా ఇంటికి వచ్చేవాడు కాదంటున్నారు. ఇటీవల అతను ఇంటికి రావడం తగ్గించడంతో.. ఇంట్లో ఆమె ఒక్కరే ఒంటరిగా ఉంటున్నట్టు చెప్పారు. ఆర్థిక స్థితి కూడా అంత బాగా లేకపోవడంతో ఆమె ఓ ప్రైవేట్ సంస్థలో విధులు నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. ఇంటి అద్దె కట్టడం కూడా కష్టం కావడంతో ఆమె సంతోషినగర్ ప్రాంతంలోని మరో అద్దె ఇంటికి మారిందన్నారు.
ఆమెపై హత్యాచారం:
భర్త తన వద్దకు రాకపోతుండటంతో ఇంట్లో ఒంటరిగా ఉంటున్న ఆమెపై ఎవరి కన్నయినా పడిందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె ఇంటికి తరుచుగా ఓ వ్యక్తి వచ్చేవాడని, అతనే హత్య చేసి ఉంటాడని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆమెపై విషాహారం ప్రయోగించి, హత్యాచారం చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. ఆమె పెద్దగా ఎవరితోనూ మాట్లాడేది కాదని, నాలుగు రోజుల నుంచి కనిపించడం లేదని చుట్టుపక్కలవాళ్లు పోలీసులకు తెలిపారు.
ఆ కోణంలోనూ:
ఆమె హత్యతో భర్తకు సంబంధం ఉందా? లేక వివాహేతర సంబంధం ఏదైనా ఏర్పడి హత్యకు దారితీసిందా? అన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కేసులో కీలక ఆధారాల కోసం షీలానగర్, నరవ, కొత్తపాలెం, గాజువాక, గోపాలపట్నం పరిసర ప్రాంతాల్లోని ప్రధాన రహదారుల్లో ఉండే సీసీ కెమెరాల ఫుటేజీలను సేకరించే పనిలో పడ్డారు.