రూ. 570 కోట్ల మిస్టరీ: కంటైనర్ల వెనక 3 కార్లు, వెనక్కి తిప్పి చిక్కారు
చెన్నై: తమిళనాడు శానససభ ఎన్నికల నేపథ్యంలో పట్టుబడిన రూ.570 కోట్ల నగదు చుట్టూ మిస్టరీ చోటు చేసుకుంది. ఆ సొమ్ముపై అనుమానాలు తలెత్తుతున్నాయి. తమిళనాడులోని తిరువూరు జిల్లా పెనమనలూరు - కునత్తూరు బైపాస్ రోడ్డులో శనివారం ఆ నగదు పట్టుబడిన విషయం తెలిసిందే.
మూడు కంటైనర్లలో ఆ సొమ్మును కనిపెట్టి తమిళనాడు ఎన్నికల అధికారులు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ మూడు కంటైనర్లను వెనక నుంచి మూడు కార్లు కూడా అనుసరిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. పోలీసులు ఆపగానే కంటైనర్లను ఆపేసి కార్లను వెనక్కి తిప్పి పారిపోయే ప్రయత్నాలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
తమిళ ఎన్నికలు:కంటైనర్లలో రూ. 570 కోట్లు సీజ్, విశాఖ లింక్
ఆ మూడు కార్లను పోలీసులు వెంటాడి చెంగపల్లి సమీపంలో పట్టుకున్న్ారు. కార్లలో ఉన్న వ్యక్తులను పోలీసులు ప్రశ్నించారు. తాము ఆంధ్రప్రదేశ్ పోలీసులమని వారు చెప్పారు. యూనిఫామ్ వేసుకోలేదని అడిగితే సమాధానం రాలేదని మీడియాలో వార్తలు వచ్చాయి. ఐడి కార్డులు చూపించడంలో కూడా వారు విఫలమైనట్లు చెబుతున్నారు.
కంటైనర్లను ఆపితే మీరెందుకు పారిపోయారని అడిగితే దొంగలు వచ్చారని పారిపోయామని చెప్పినట్లు సమాచారం. వారిని పోలీసులు కలెక్టర్, ఎస్పీ ఎదుట ప్రవేశపెట్టారు. అక్కడ కూడా ఏ మాత్రం పొంతన లేని సమాధానాలు చెప్పారని అంటున్నారు. ఎస్బీఐ లేదా ఆర్బీఐ నుంచి తమకు తగిన వివరాలతో కూడిన లేఖలు వస్తేనే నగదును వదులుతామని అధికారులు చెబుతున్నట్లు మీడియా వార్తలు తెలియజేస్తున్నాయి.
మీడియా కథనాల ప్రకారం - ఎస్బీఐ గానీ ఆర్బీఐ గానీ ఇంతవరకు తమిళనాడు అధికారులను సంప్రదించలేదు. అర్థరాత్రి 12 గంటల సమయంలో కోయంబత్తూరులో లారీలు బయలుదేరాయి. తిరువూరుకు అర్థరాత్రి దాటిన తర్వాత 12.40 గంటలకు చేరుకున్నాయి. అంత అర్థరాత్రి అంత పెద్ద మొత్తాన్ని ఎందుకు పంపారనే విషయం బోధపడడం లేదు. అది కూడా సెక్యూరిటీ లేకుండా పంపించారు
అంత పెద్ద మొత్తం తరలిస్తుంటే చీఫ్ జనరల్ మేనేజర్ స్థాయి అధికారి వెంట ఉండాలి. కానీ అలాంటి దాఖలాలు ఏవీ లేవు. వాళ్ల వద్ద ఉన్న ఇన్వాయిస్లో మాత్రం సూరిబాబు అనే వ్యక్తి ద్వారా ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో గల బాలాజీనగర్ ప్రధాన శాఖకు నగదు తరలిస్తున్నట్లు ఉంది. అటువంటి సందర్భాల్లో అర్బీఐ అనుమతి ఉండాలి. తగినత భద్రత కూడా ఉండాలి.
ఇంత పెద్ద మొత్తాన్ని ఒక్కసారి విశాఖపట్నం బ్యాంకుకు ఎందుకు తరలిస్తున్నారు, ఎవరైనా ప్రైవేట్ ఖాతాలకు తరలిస్తున్నారా, మరేదైనా మతలబు ఉందా అనే ప్రశ్నలకు సమాధానాలు రాబట్టడానికి విచారణ కొనసాగుతోంది. కోయంబత్తూరు, విశాఖపట్నం బ్యాంక్ అధికారులకు సమాచారం అందించారు. దాంతో వారు ఇక్కడికి చేరుకుంటున్నారు.