పల్లెలకు పాకుతున్న వింత వ్యాధి వెనుక రాజకీయ కుట్ర కోణం : మంత్రి ఆళ్ళ నాని అనుమానం
పశ్చిమగోదావరి జిల్లాలో వింత వ్యాధి కలకలం కొనసాగుతూనే ఉంది. గత సంవత్సరం ఏలూరులో విస్తరించిన వింత వ్యాధి, ఇప్పుడు మళ్ళీ పశ్చిమ గోదావరి జిల్లాలోని పలు గ్రామాలను వణికిస్తుంది. నాలుగైదు రోజుల నుంచి పూళ్ళ, భీమడోలు, గుండుగొలను , కొమిరేపల్లి గ్రామాలలో మొత్తం 36 మంది వింత వ్యాధి బారిన పడ్డారు. కొమిరేపల్లి లో గురువారం రాత్రి ఒక కేసు నమోదు కాగా శుక్రవారం మొత్తంగా 24 మంది ఈ వ్యాధి బారిన పడటం ప్రజలను భయాందోళనకు గురి చేసింది. అయితే ఈ వింత వ్యాధి ప్రబలటం వెనుక రాజకీయ కుట్ర ఉందన్న అనుమానం మంత్రి ఆళ్ళ నాని వ్యక్తం చేస్తున్నారు.
Recommended Video
ఎస్సై ఆత్మహత్యను రాజకీయంగా వాడుకుంటారా ? చంద్రబాబు, దేవినేని ఉమపై పోలీస్ అధికారుల సంఘం ధ్వజం
కొమిరేపల్లిలో వింత వ్యాధి బాధితులను పరామర్శించిన ప్రభుత్వ ఉన్నతాధికారులు
వింత వ్యాధి బాధితుల అందరిలోనూ కళ్ళు తిరగడం ,స్పృహ కోల్పోవడం, నీరసంతో చతికలపడటం, నోటి నుండి నురగ రావడం వంటి లక్షణాలు కనిపించాయి. వెంటనే అప్రమత్తమైన ప్రభుత్వం ఉన్నతాధికారులను రంగంలోకి దించింది. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తో పాటుగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ , వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ భాస్కర్ కాటంనేని, ప్రజారోగ్య శాఖ సంచాలకులు డాక్టర్ గీతా ప్రసాదిని కొమిరేపల్లి కి చేరుకొని పరిస్థితిని పర్యవేక్షించారు. బాధితులను పరామర్శించారు.
ఎవరికీ ప్రాణాపాయం లేదని, భయపడాల్సిన పని లేదన్న అధికారులు
వింత వ్యాధితో బాధపడుతున్న వారిలో ఎవరికీ ప్రాణాపాయ పరిస్థితి లేదని, వైద్యచికిత్స అందిన వెంటనే వారంతా తిరిగి కోలుకుంటున్నారని అటు అధికారులు, మంత్రి ఆళ్ల నాని వెల్లడించారు. గతేడాది డిసెంబర్లో ఏలూరులో వందల సంఖ్యలో అకస్మాత్తుగా వింత వ్యాధి బారిన పడిన సంఘటనలకు కారణాలపై అధ్యయనం చేయడానికి జాతీయ సంస్థలు రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. ఢిల్లీ ,పూణే, హైదరాబాద్ వంటి నగరాల నుండి ఏలూరులో వివిధ సంస్థల నుంచి వచ్చిన ప్రతినిధులు అక్కడ త్రాగు నీటి పైన, ఆహారపదార్థాల పైన పరిశోధన జరిపి సంఘటనలకు గల కారణాలను క్రోడీకరించిన నివేదికను తయారు చేశారు .
ఏలూరు ఘటన వన్ టైం ఎపిసోడ్ అన్న వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్
త్వరలో సీఎం జగన్ కు ఆ నివేదిక అందజేస్తామని పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు ఘటన వన్ టైం ఎపిసోడ్ గా ఉన్నతస్థాయి కమిటీ అభిప్రాయపడింది అని అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు. ఏలూరు కెనాల్ వెంట ఉన్న గ్రామాలలో నమూనాలను సేకరించి పరీక్షలు నిర్వహిస్తున్నామని, ఎవరు ఎలాంటి భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదని అధికారులు చెప్తున్నారు . సీఎం జగన్ ఆదేశాల మేరకే కొమిరేపల్లికి వచ్చామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్య నాథ్ దాస్ వెల్లడించారు.
అంతుచిక్కని వ్యాధి ఘటనల వెనుక రాజకీయ కుట్ర : ఆళ్ళ నాని
వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని మాట్లాడుతూ అంతుచిక్కని వ్యాధి సంఘటనలకు సంబంధించి రాజకీయ కుట్ర కోణం ఉన్నట్లుగా భావించాల్సి వస్తోందని అనుమానం వ్యక్తం చేశారు . కొమిరేపల్లిలో బాధితులను పరామర్శించిన అనంతరం మాట్లాడిన ఆళ్ల నాని ఏలూరు పరిసర ప్రాంతాల్లో వ్యాధిని వారం రోజుల్లో పూర్తిగా అదుపులోకి తీసుకు వచ్చామని మళ్లీ కొత్తగా అక్కడక్కడా కేసులు నమోదు కావటం పలు అనుమానాలకు తావిస్తోందని పేర్కొన్నారు.
వింత వ్యాధి మిస్టరీ ని చేదించాల్సిన బాధ్యత సర్కార్ దే
నమూనాల పరీక్షలను నిర్వహించిన తర్వాత నివేదికలు వచ్చాక తదుపరి చర్యలు తీసుకుంటామని వివరించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు లో గత ఏడాది జరిగిన వింత వ్యాధి ఘటన జాతీయ సంస్థలన్నీ వన్ టైం ఎపిసోడ్ గా పేర్కొన్న నేపధ్యంలో ప్రస్తుత ఘటనలపై రాజకీయ కుట్ర ఉండే అవకాశం ఉందని ఆళ్ల నాని అనుమానం వ్యక్తం చేశారు. ఏదేమైనా పశ్చిమగోదావరి జిల్లాలో కలకలం రేపుతున్న వింత వ్యాధికి సంబంధించిన మిస్టరీ ప్రభుత్వం ఛేదించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.