రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగి అనుమానాస్పద మృతి:వీడిన మిస్టరీ...ప్రియుడి కోసం భార్యే!
అనంతపురం:కదిరి పట్టణంలో కలకలం సృష్టించిన ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగి వెంకటరమణ అనుమానాస్పద మృతి వెనుక ఉన్న మిస్టరీని పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతో వెంకటరమణ భార్యే తన ప్రియుడితో కలసి ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు పోలీసులు నిర్థారించారు.
పాపను కాపాడుకోవడానికి ఆ తల్లిదండ్రులు పడే వేదన వర్ణానాతీతం.. మీ సాయం కావాలి
అయితే ఇందుకోసం నిందితులు వేసిన ప్లాన్ తో పాటు ఏకంగా సైనేడ్ వినియోగించడం పోలీసులనే నివ్వెరపరిచింది. అంతేకాకుండా ఇప్పటివరకు భర్త హత్య వెనక భార్య హస్తం ఉన్న ఉదంతాలు అనేకం వెలుగు చూసినా...వీటిలో బాధితులు,సూత్రధారులు, పాత్రధారులు అత్యధికం యువజనులే కావడం గమనార్హం. అయితే తాజా ఉదంతంలో భర్త వృద్దుడని కూడా చూడకుండా అవివాహితుడైన ప్రియుడి కోసం హతుడి భార్య ఈ దారుణానికి పాల్పడటం చర్చనీయాంశంగా మారింది.
గుడిలో...పరిచయం...సాన్నిహిత్యం
కదిరి అర్బన్ సీఐ గోరంట్ల మాధవ్ మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం...కదిరికి చెందిన వెంకటరమణ ఆర్టీసీలో పనిచేసి కొంతకాలం రెండేళ్ల కిందటే రిటైర్ అయ్యాడు. పదవీ విరమణ పొంది ఇంటివద్దనే ఉంటున్న వెంకట రమణతో ఆయన భార్య రామాంజినమ్మ చీటికి మాటికి గొడవ పడుతూ ఉండేది. కారణం ఈమెకు కదిరిలోని బాలాజి వీధికి చెందిన రామాంజనేయులుతో వివాహేతర సంబంధం ఉంది. తరుచూ సాయిబాబా గుడికి వెళ్లే రామాంజినమ్మకు అక్కడే అవివాహితుడైన రామాంజనేయులుతో పరిచయమై సాన్నిహిత్యానికి దారితీసింది.
భర్తను...అడ్డు తొలగించుకోవాలని
ఈ క్రమంలో భర్త రిటైర్ అయ్యి ఇంటి వద్దే ఉండటంతో పాటు ఎక్కడకు వెళుతున్నా ఆరా తీస్తుండటం, ప్రియుడు రామాంజనేయులు డబ్బు అడగటంతో అన్నిటికీ అడ్డుగా ఉన్న భర్తను అడ్డు తొలగించుకోవాలని ప్రియుడితో కలసి యోచన చేసింది. ఆ మేరకు వెంకట రమణను హత్య చేసేందుకు ఇద్దరూ పక్కా స్కెచ్ రూపొందించారు. ఆ ప్లాన్ ప్రకారం వెంకట రమణను వెంటనే చనిపోయేందుకు సైనేడ్ వాడి హత్య చేయాలనుకున్నారు. ఈ మేరకు రామాంజనేయులు గతంలో తాను అనంతపురంలో పనిచేసిన బంగారు వ్యాపారి మహేష్ దగ్గరకు వెళ్లి...తాను కూడా కొత్తగా నగల వ్యాపారం ప్రారంభిస్తున్నానని అబద్ధం చెప్పి ఒక కిలో సైనైడ్ తీసుకొచ్చాడు.
దేవుడి...ప్రసాదం పేరిట...హత్య
ఈనెల 6 వ తేదీన రామాంజనేయులు తన పుట్టినరోజు అని వెంకట రమణ దంపతులను ఇంటికి ఆహ్వానించారు. ముందుగా వేసుకున్న స్కెచ్ ప్రకారం రామాంజనేయుడు సైనేడ్ కలిపిన ప్రసాదం వెంకటరమణ దంపతులకు అందించాడు. అయితే అందులో సైనేడ్ కలసిన విషయం ముందుగానే తెలియడంతో రామాంజినమ్మ ఆ ప్రసాదం తినలేదు. ఈ విషయం తెలియని వెంకటరమణ ప్రసాదం తిన్న వెంటనే కుప్పకూలిపోయి అపస్మారక స్థితికి చేరుకున్నాడు.
అతి తెలివి...కేసు నమోదు
దీంతో వెంకట రమణను ఆయన భార్య రామాంజినమ్మ ఆమె ప్రియుడు రామాంజనేయులు ముందుగా ఓ ప్రైవేటు ఆసుప్రతికి తరలించారు. అయితే పరిస్థితి విషమంగా ఉందని ప్రభుత్వాసుపత్రికి తరలించాలని అక్కడి డాక్టర్ సూచించగా అక్కడికి తరలించే లోపే మృతి చెందాడు. అయితే రామాంజినమ్మ తాము హత్య చేసిన విషయం బైటకు పొక్కకూడదనే ఉద్దేశ్యంతో...వైద్యులు సకాలంలో వైద్యం అందించకపోవడం వల్లే తన భర్త చనిపోయాడని రామాంజినమ్మ ఆస్పత్రి ఎదుట కాలనీవాసులతో కలిసి రాస్తారోకో చేసింది. ఆ రోజు పట్టణ పోలీసులు వారికి నచ్చజెప్పి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలెట్టారు.
పోలీసులు...చేధించారు
డీఎస్పీ శ్రీలక్ష్మీ ఈ కేసును ఛాలెంజ్గా తీసుకొని పట్టణ సీఐ గోరంట్ల మాధవ్కు విచారణ బాధ్యతలు అప్పగించారు. సీఐ తమ సిబ్బందితో కలిసి దర్యాప్తు చేయగా... నిందితుల సెల్ నంబర్ల ఆధారంగా అసలు విషయం బయటపడింది. అనుమానం ధృవపడి మృతుడి భార్యను గట్టిగా విచారించగా అసలు విషయం తెలిసింది. దీంతో నిందితులు రామాంజినమ్మ, రామాంజనేయులును పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
A