భారీగా పట్టుబడ్డ బంగారంపై ఎన్నో అనుమానాలు..మిస్టరీ చేధనలో అధికారులు
రెండ్రోజుల క్రితం తమిళనాడులో భారీగా పట్టుబడ్డ బంగారం పై ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తిరపతికి ఈ బంగారాన్ని తరలిస్తున్న సమయంలో ఎన్నికల అధికారులు పట్టుకున్నారు. అయితే పట్టుబడిన ఈ బంగారం పై ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు అడుగుతున్న ప్రశ్నలకు టీటీడీ చెబుతున్న సమాధానాలకు పొంతన కుదరడం లేదు. దీంతో ఈ మిస్టరీని చేధించే పనిలో పడ్డారు ఎన్నికల అధికారులు.
పలు ప్రశ్నలకు దొరకని సమాధానం
తమిళనాడు నుంచి తిరుపతికి వ్యాన్లలో తరలిస్తున్న బంగారాన్ని ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు పట్టుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ బంగారం ఎవరిది... ఎక్కడ నుంచి వచ్చింది... ఎక్కడికి వెళుతోంది... ఇందులో ఎక్కడికి వెళుతోంది అనే ప్రశ్నకు మాత్రమే సమాధానం స్పష్టంగా ఉంది. మిగతా రెండు ప్రశ్నలకు మాత్రం సమాధానం మిస్టరీగానే మిగిలింది. ముందుగా బంగారం ప్యాక్ చేసిన బాక్సులపై బ్రిటీష్ ఎయిర్వేస్ లేబుల్స్ ఉన్నాయి. అయితే ఈ బంగారాన్ని స్విట్జర్లాండ్లో కొనుగోలు చేసినట్లు అధికారులు ధృవీకరించారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ ద్వారా స్విట్జర్లాండ్లో కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. చెన్నైలోని పంజాబ్ నేషనల్ బ్యాంకులో బంగారాన్ని డిపాజిట్ చేశామని దాన్నే శ్రీవారి ఆలయానికి తరలిస్తుండగా పట్టుకున్నారని టీటీడీ అధికారులు చెబుతున్నారు. మరి అలాంటప్పుడు దానిపై బ్రిటీష్ ఎయిర్ వేస్కు సంబంధించిన లేబుల్స్ ఎందుకున్నాయనేది తొలుత మెదులుతున్న ప్రశ్న.
బంగారంపై కనిపించని మింట్ ముద్రలు
ఇక శ్రీవారి నగలను కేంద్రప్రభుత్వం అధీనంలో పనిచేసే మింట్కు తీసుకెళ్లి కరిగించి కడ్డీలుగా మార్చి ఆ తర్వాత బ్యాంకుల్లో డిపాజిట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మింట్లో బంగారాన్ని కరిగిస్తే దానికి సంబంధించిన ముద్రలు ఉంటాయి. అంతేకాదు పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి బంగారం బయటకు వస్తే దానిపై ఆ బ్యాంకు సీలు ఉ:టుంది. అయితే ఈ బంగారంపై మాత్రం వేరే ముద్రలు కనిపిస్తున్నాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ సీళ్లు కూడా కనిపించడం లేదు. దీంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక శ్రీవారికి సంబంధించిన నగలు, బంగారం బ్యాంకుల్లో డిపాజిట్ చేసేముందు ఆలయానికి చెందిన ధర్మకర్తల మండలి పలువురు అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటుంది. అయితే టీటీడీ అధికారులు చెబుతున్నట్లుగా ఒకవేళ పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి బంగారాన్ని తీసుకువస్తున్నట్లే అయితే ఈ బంగారాన్ని ఎప్పుడు డిపాజిట్ చేశారనే దానిపై క్లారిటీ లేదు. అంత పెద్ద మొత్తంలో బంగారాన్ని తరలిస్తున్నప్పుడు ఎలాంటి భద్రత తీసుకోకపోవడంపై అనుమానాలు మరింత బలపడుతున్నాయి.
కనిపించిన నిర్లక్ష్యం
సాధారణంగా రూ.50 లక్షలు విలువ చేసే బంగారం కానీ, నగదు కానీ ఒక బ్యాంకు నుంచి మరో బ్యాంకుకు తరలించే సమయంలో పూర్తి ఎస్కార్టు మధ్య అధికారులు తరలించాలని రిజర్వ్ బ్యాంకు నిబంధనలు పేర్కొంటున్నాయి. మరి రూ.400 కోట్లు విలువ చేసే 1381 కిలో బంగారం తరలించేటప్పుడు కనీస భద్రత తీసుకోవడంలో ఎందుకు నిర్లక్ష్యం వహించారనేది మరో ప్రశ్న. సాధారణంగా బ్యాంకుల్లో డబ్బులు డిపాజిట్ చేసినా విత్ డ్రాచేసినా లేదా నగలు డిపాజిట్ చేసినా, తీసుకున్నా రసీదును తీసుకుంటారు. మరి అంత పెద్ద మొత్తంలో బంగారం తీసుకువస్తున్నప్పుడు అది కూడా ఎన్నికల కోడ్ ఉందని తెలిసి తరలిస్తున్నప్పుడు రసీదు ఎందుకు తీసుకోలేదు అనేది మరో అనుమానంగా మిగిలింది.
మొత్తానికి ఎన్నికల వేళ ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా పెద్ద మొత్తంలో బంగారం పట్టుబడటం సరైన పత్రాలు లేకపోవడం..టీటీడీ అధికారులు ఇస్తున్న సమాధానాలు సంతృప్తికరంగా లేకపోవడంతో చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టీటీడీ తీరుపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పట్టుబడింది కాబట్టి బయటకు తెలిసిందని చెబుతున్న భక్తులు ఇంకా ఇలాంటివి ఆలయంలో ఎన్ని జరుగుతున్నాయో బయటపెట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు.