దురుద్దేశంతో ప్రారంభించే ప్రాజెక్టులకు వ్యతిరేకం: ఏపి, టిలపై మైసూరా
హైదరాబాద్: రాజకీయ దురుద్దేశంతో ప్రారంభించే ప్రాజెక్టులకు తమ పార్టీ వ్యతిరేకమని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మైసూరా రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న పట్టిసీమ ప్రాజెక్టు రాజకీయ దురుద్దేశంతోనే చేపడుతోందని అన్నారు.
విభజన చట్టాన్ని ఇరు రాష్ట్రాలు ఉల్లంఘిస్తున్నాయన్నారు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై కృష్ణా రివర్ బోర్డు, సిడబ్ల్యూసి అనుమతి తీసుకోవాలన్నారు. పట్టిసీమ విషయంలో ఏపి ప్రభుత్వం సిడబ్ల్యూసి అనుమతి తీసుకుంటే బాగుండేదని మైసూరా అన్నారు.
అయితే ఏపి సిఎం చంద్రబాబునాయుడు అనుమతులు తీసుకోకుండా ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారని అన్నారు. రెండు రాష్ట్రాల ప్రజలను రెచ్చగొట్టే విధంగా ఇద్దరు సిఎంలు వ్యవహరించడం తగదన్నారు.
అనుమతుల్లేని ప్రాజెక్టు నిర్మాణాలపై కేంద్ర జలవనరుల శాఖ, సిడబ్ల్యూసికి తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి లేఖ రాస్తారని చెప్పారు. చట్టాలను రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు గౌరవించాలన్నారు.