సిగ్గుచేటు: కృష్ణాజలాల మంటలపై మైసురా
హైదరాబాద్: శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసులు కొట్టుకోవడం సిగ్గు చేటు అని వైయస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత ఎంవి మైసురా రెడ్డి విమర్శించారు. దీనికి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కె. చంద్రశేఖర రావు, నారా చంద్రబాబు నాయుడు బాధ్యత వహించాలని ఆయన శనివారం మీడియా సమావేశంలో అన్నారు.
ఈ గొడవలు చూస్తుంటే తెలుగు ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉన్నాయని ఆయన అన్నారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ముందుగానే మాట్లాడుకుని ఉంటే ఈ పరిస్థితి వచ్చేదే కాదని ఆయన అన్నారు. ఇద్దరు ముఖ్యమంత్రులూ సమస్య పరిష్కారానికి గవర్నర్ వద్దకు వెళ్లడం సిగ్గు చేటు అని ఆయన వ్యాఖ్యానించారు.
ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా రాజ్యాంగ సంక్షోభం సృష్టిస్తున్నారని మైసురా రెడ్డి అభిప్రాయపడ్డారు ఈ పరిస్థితి ఎక్కడికి దారి తిస్తుందోనని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇద్దరు ముఖ్యమంత్రులూ సవాళ్లు, ప్రతి సవాళ్లు మానుకుని సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేయాలని ఆయన సూచించారు.
తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదాలు మంచిది కాదని ఆయన అన్నారు. విద్వేషాలు రెచ్చగొట్టడం వ్యతిరేక పరిస్థితులకు దారి తీస్తుందని ఆయన అన్నారు. వివాదాలను సామరస్యవూర్వకంగా పరిష్కరించుకోవాలని ఆనయ సూచించారు.